ఓడెన్స్: డెన్మార్క్ ఓపెన్లో భారత సీనియర్ షట్లర్ సైనా నెహ్వాల్ నిష్క్రమించగా.. లక్ష్యసేన్ ముందడుగు వేశాడు. గాయం నుంచి కోలుకుని డెన్మార్క్ ఓపెన్ సూపర్ టోర్నీలో బరిలోకి దిగిన సైనా 16-21, 14-21తో అయా ఓహోరి (జపాన్) చేతిలో పరాజయం పొందింది. 34 నిమిషాల్లో ముగిసిన పోరులో సైనా ఏమాత్రం పోరాటపటిమ కనబరుచలేకపోయింది. మరోవైపు పురుషుల సింగిల్స్లో యువ షట్లర్ లక్ష్యసేన్ 21-9, 21-7తో సౌరభ్వర్మపై అలవోక విజయం సాధించాడు. అరగంటలోనే ముగిసిన పోరులో లక్ష్యసేన్ అద్భుత షాట్లతో ఆకట్టుకున్నాడు. మహిళల డబుల్స్లో భారత ద్వయం అశ్విని పొనప్ప, సిక్కిరెడ్డి 17-21, 13-21తో కొరియా జోడీ లీ సోచి, షిన్ సెంగ్యుచన్ చేతిలో ఓడి టోర్నీ నుంచి వైదొలిగింది. మరో డబుల్స్ పోరులో భారత్ జోడీ మేఘన, పూర్వీశ 8-21, 7-21తో ఇండోనేషియా జంట నీటా వయోలినా, పుత్రి సైకాపై ఓటమిపాలయ్యారు. మిక్స్డ్ డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్, అశ్విని జోడీ 17-21, 21-14, 11-21తో చైనా ద్వయం ఫెంగ్ యాన్ జీ, డు యిపై పోరాడి ఓడారు. పురుషుల సింగిల్స్లో ప్రణయ్ 18-21, 19-21తో జోనథాన్ క్రిస్టి(ఇండోనేషియా) చేతిలో ఓడి నిష్క్రమించాడు. ఇక గాయం కారణంగా మ్యాచ్ ప్రారంభమైన రెండు నిమిషాలకే సీనియర్ షట్లర్ పారుపల్లి కశ్యప్ వెనుదిరిగాడు.