బెంగళూరు: బౌలర్ల శ్రమకు ఓపెనర్ల దంచుడు తోడవడంతో.. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి విజయం నమోదు చేసుకుంది. లీగ్ ఆరంభ పోరులో ముంబై చేతిలో ఓడిన ఢిల్లీ.. సోమవారం 9 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్ను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన యూపీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 119 పరుగులు చేసింది. శ్వేత షెరావత్ (45) టాప్ స్కోరర్ కాగా.. ఢిల్లీ బౌలర్లలో మరినె కాప్ 4 ఓవర్లలో 5 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. రాధ యాదవ్కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ 14.3 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 123 పరుగులు చేసింది. ఓపెనర్లు మెగ్ లానింగ్ (51; 6 ఫోర్లు), షఫాలీ వర్మ (43 బంతుల్లో 64 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకాలతో అదరగొట్టారు. లీగ్లో భాగంగా మంగళవారం గుజరాత్ జెయింట్స్తో బెంగళూరు తలపడనుంది.