Brij bhushan | న్యూఢిల్లీ, జూన్ 15: లైంగిక వేధింపుల కేసులో డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ను కాపాడేందుకు మోదీ సర్కార్ పెద్ద ఎత్తున పావులు కదుపుతున్నది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు రూపొందించిన వెయ్యి పేజీల నివేదిక పలు అనుమానాల్ని రేకెత్తిస్తున్నది. పోక్సో చట్టం కింద ఎంపీ బ్రిజ్ భూషణ్పై నమోదైన కేసును ఎత్తేయాలంటూ ఈ నివేదికలో ఢిల్లీ పోలీసులు కోర్టును కోరటం సంచలనంగా మారింది. ఏప్రిల్ 21న బ్రిజ్ భూషణ్పై ఏడుగురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయగా, బాధితుల్లో ఒక మైనర్ ఉన్నారు.
ఈ నేపథ్యంలో పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లను నమోదుచేశారు. ఈ రెండు ఎఫ్ఐఆర్లకు సంబంధించి దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు, లైంగిక వేధింపులు, వెంబడించటంపై చార్జ్షీట్ దాఖలు చేశారు. దీనిపై రౌస్ ఎవెన్యూ కోర్టు జూన్ 22న విచారించనున్నది. మైనర్ రెజ్లర్ పెట్టిన కేసులో ధ్రువీకరించే సాక్ష్యాలు లేవంటూ 500 పేజీల నివేదికను పటియాలా హౌస్ కోర్టుకు పోలీసులు సమర్పించారు. పోక్సో కేసు కొట్టేయాలని కోర్టును కోరారు. ఈ నివేదికపై కోర్టు జులై 4న విచారణ జరపనున్నది. కేసును ఎత్తేయాలంటూ పోలీసులే నివేదిక ఇవ్వటాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. ఓ వైపు మహిళా రెజ్లర్లపై ఒత్తిడి తీసుకొస్తూ, మరోవైపు కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి.