ముంబై: బయోబబుల్ వాతావరణంలో కొనసాగుతున్న ఐపీఎల్ 15వ సీజన్లో కరోనా కేసులు వెలుగు చూడటంతో బీసీసీఐ అప్రమత్తమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆల్రౌండర్ మిషెల్ మార్ష్తో పాటు.. మరో నలుగురికి కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ కావడంతో.. బుధవారం ఢిల్లీ, పంజాబ్ మధ్య జరుగాల్సిన మ్యాచ్ వేదికను మార్చింది. షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ పుణెలో జరుగాల్సి ఉండగా.. సుదూర ప్రయాణాలతో ఇబ్బంది తలెత్తకూడదనే ఉద్దేశంతో ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు బోర్డు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
‘లీగ్ దశలో బుధవారం ఢిల్లీ, పంజాబ్ మధ్య జరుగాల్సిన మ్యాచ్ను పుణె నుంచి ముంబైకి మార్చాం. బస్సు ప్రయాణాలతో ఇబ్బంది కలుగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఢిల్లీ జట్టులో కరోనా సోకిన వాళ్లు ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నారు. నాలుగు రోజులుగా ఆ బృందంలోని వారందరికీ రెగ్యులర్గా ఆర్టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహిస్తున్నాం. మిగిలిన వారందరికీ నెగిటివ్ అని తేలింది. బుధవారం మ్యాచ్కు ముందు మరోసారి పరీక్షలు నిర్వహిస్తాం’అని అందులో పేర్కొంది.