ముంబై: అరంగేట్ర మహిళల క్రికెట్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో ఢిల్లీ 5 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్పై ఘన విజయం సాధించింది. దీని ద్వారా ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో ఆరు విజయాలు, రెండు ఓటములతో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ నేరుగా ఫైనల్ పోరులో నిలిచింది. మరోవైపు మరో ఫైనల్ బెర్తు కోసం ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ జట్ల మధ్య ఈ నెల 24న ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది.
మ్యాచ్ విషయానికొస్తే..యూపీ నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యఛేదనలో ఢిల్లీ 17.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. కెప్టెన్ మెగ్ ల్యానింగ్ (39), మారిజానె కాప్ (34 నాటౌట్), అలైస్ క్యాప్సె (34)రాణించారు. ల్యానింగ్ తన ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు, రెండు భారీ సిక్స్లతో దూకుడైన ఆటతీరు కనబరిచింది.
షబ్నమ్ ఇస్మాయిల్ (2/29) రెండు వికెట్లు తీసింది. తొలుత యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 138/6 స్కోరు చేసింది. తహిలా మెక్గ్రాత్ (58 నాటౌట్) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, అలీస్సా హిలీ (36) ఫర్వాలేదనిపించింది. క్యాప్సె (3/26), రాధా యాదవ్(2/28)రాణించారు. క్యాప్సెకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. ఇదిలా ఉంటే మరో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో ఆర్సీబీపై విజయం సాధించింది.