హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ అథ్లెట్ జివాంజీ దీప్తి అంతర్జాతీయ వేదికపై మరోమారు తళుక్కుమంది. బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఓషియానా గేమ్స్లో పసిడి పతకంతో మెరిసింది. బుధవారం జరిగిన మహిళల 400మీటర్ల టీ20 రేసును దీప్తి 57.58 సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచింది. పరుగులో చిరుతను తలపిస్తూ ప్రత్యర్థులకు దీటైన సవాలు విసురుతూ ఈ యువ అథ్లెట్ స్వర్ణాన్ని ముద్దాడింది. నీనా కన్నో (59.86సె, ఎల్విన్ ఎల్హద్ (62.26) వరుసగా రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. వరంగల్ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి అంచలంచెలుగా ఈ స్థాయికి ఎదిగింది. ఓవైపు పేదరికం ప్రతిబంధకంగా మారినా..పరుగును ప్రాణంగా ప్రేమిస్తూ పతకాలు కొల్లగొడుతున్నది. పసిడి పతకం సాధించిన దీప్తిని జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ అభినందించారు.