హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ అథ్లెట్ జివాంజీ దీప్తి మరోమారు అంతర్జాతీయ వేదికపై సత్తాచాటింది. ప్రతిభకు హద్దులు లేవని నిరూపిస్తూ బ్రిస్బేన్(ఆస్ట్రేలియా) వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఓషియానా ఏషియన్ గేమ్స్లో దీప్తి మెరుపులు మెరిపించింది. మహిళల టీ20 ఈవెంట్ 400 మీటర్ల విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం ఉదయం 11.30 గంటలకు ఫైనల్ రేసు జరుగనుంది. కల్లెడ(వరంగల్)కు చెందిన దీప్తిది నిరుపేద కుటుంబం. కష్టపడి పనిచేస్తే తప్ప పూట గడువని పరిస్థితి. దీప్తి ప్రతిభను గుర్తించిన జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్.. మెరికలాగా తీర్చిదిద్దారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించాలన్న పట్టుదలతో దీప్తి బరిలోకి దిగనుంది.