పరుగుల వరద పారిన పోరులో బ్యాటర్లు పండుగ చేసుకున్నారు. మొదట దీపక్ హుడా సూపర్ సెంచరీకి సంజూ శాంసన్ మెరుపులు తోడవడంతో భారీ స్కోరు చేసిన టీమ్ఇండియా.. ఆనక బౌలింగ్లోనూ క్రమశిక్షణ కనబర్చి సిరీస్ కైవసం చేసుకుంది. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో.. ఒత్తిడిని అధిగమించిన టీమ్ఇండియాను విజయం వరించింది. ఫలితం భారత్కు అనుకూలంగా వచ్చినా.. భారీ లక్ష్యఛేదనలో ఏమాత్రం వెరువని ఐర్లాండ్ ఆటగాళ్లు.. తమ పోరాటంతో అభిమానుల మనసులు గెలుచుకున్నారు!
డబ్లిన్: పొట్టి ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా ఐర్లాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్ను టీమ్ఇండియా క్లీన్స్వీప్ చేసింది. మంగళవారం జరిగిన హోరాహోరీ పోరులో భారత్ 4 పరుగుల తేడాతో ఐర్లాండ్పై విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. వన్డౌన్ బ్యాటర్ దీపక్ హుడా (57 బంతుల్లో 104; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) అద్వితీయ శతకంతో కదం తొక్కగా.. అతడికి సంజూ శాంసన్ (42 బంతుల్లో 77; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) చక్కటి సహకారం అందించాడు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున ఇది నాలుగో శతకం కాగా.. హుడా, శాంసన్ రెండో వికెట్కు రికార్డు స్థాయిలో 176 పరుగులు జోడించారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ 3, జోష్ లిటిల్, క్రెయిగ్ యాంగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఐర్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 221 పరుగులకు పరిమితమైంది. కెప్టెన్ బాల్బిర్నె (37 బంతుల్లో 60; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), పాల్ స్టిర్లింగ్ (18 బంతుల్లో 40; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. వీరిద్దరి ధాటితో ఐర్లాండ్ 10 ఓవర్లలోనే 107/2తో నిలిచి భయపెట్టింది. వచ్చినవాళ్లు వచ్చినట్లు బాదుడే పనిగా పెట్టుకోవడంతో ఒక దశలో ఐర్లాండ్ విజయం ఖాయమే అనిపించింది. ఆఖరి ఓవర్లో ఆ జట్టు విజయానికి 17 పరుగులు అవసరం కాగా.. 12 పరుగులే చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్, రవి బిష్ణోయ్, హర్షల, ఉమ్రాన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
బాదుడే బాదుడు..
గత మ్యాచ్లో వర్షం కారణంగా పూర్తి స్థాయి ఆట సాధ్యం కాకపోగా.. వరుసగా రెండో మ్యాచ్లోనూ టాస్ నెగ్గిన హార్దిక్ పాండ్యా ఈసారి మెదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఐర్లాండ్ బౌలర్లు ఆరంభంలో కట్టుదిట్టమైన బంతులేయడంతో టీమ్ఇండియాకు శుభారంభం దక్కలేదు. మూడో ఓవర్లో ఇషాన్ కిషన్ (3) ఔట్ కాగా.. 5 ఓవర్లు ముగిసేసరికి భారత్ 39/1తో నిలిచింది. అక్కడి నుంచి హుడా, శాంసన్ దంచుడు మొదలెట్టడంతో ఆట స్వరూపం మారిపోయింది. జోష్ లిటిల్ ఓవర్లో హుడా రెండు ఫోర్లతో మోత మొదలుపెడితే.. యాంగ్ బౌలింగ్లో శాంసన్ రెండు ఫోర్లు అరుసుకున్నాడు. గారెత్ వేసిన 9వ ఓవర్లో శాంసన్ 4,6 బాదగా.. మరుసటి ఓవర్లో రెండు భారీ సిక్సర్లతో హుడా అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. తదుపరి ఓవర్లో రెండు ఫోర్లు దంచిన హుడా.. 12వ ఓవర్లో 4,6,4 కొట్టాడు. వీరిద్దరూ వంతులు వేసుకొని మరి ఐర్లాండ్ బౌలర్లను చీల్చి చెండాడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో శాంసన్ కూడా హాఫ్సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ జంట మరింత ధాటిగా ఆడటంతో.. 15 ఓవర్లు ముగిసేసరికి భారత్ 177/1తో పటిష్ట స్థితిలో నిలిచింది. రెండో వికెట్కు 176 పరుగులు (85 బంతుల్లో) జోడించాక శాంసన్ ఔట్ కాగా.. కాసేపటికే హుడా తొలి అంతర్జాతీయ శతకం నమోదు చేసుకున్నాడు.
భారత్ తరఫున టీ20ల్లో ఏ వికెట్కైనా ఇదే (హుడా, శాంసన్; 176 పరుగులు) అత్యధిక భాగస్వామ్యం. రాహుల్, రోహిత్ శర్మ (165 రన్స్; 2017 శ్రీలంకపై) రికార్డు రెండో స్థానానికి చేరింది.
పొట్టి ఫార్మాట్లో టీమ్ఇండియా తరఫున సెంచరీ చేసిన నాలుగో ప్లేయర్గా హుడా రికార్డుల్లోకెక్కాడు. రోహిత్, రాహుల్, రైనా, ముందున్నారు.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 20 ఓవర్లలో 225/7 (దీపక్ హుడా 104, సంజూ శాంసన్ 77; మార్క్ 3/42), ఐర్లాండ్: 20 ఓవర్లలో 221/5 ( బాల్బిర్నే 60, స్టిర్లింగ్ 40, రవి 1/41, ఉమ్రాన్ 1/42).