ఢిల్లీ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో పంజాబ్ బ్యాటింగ్ తేలిపోయింది. దీంతో ఈ సీజన్లో అత్యల్ప స్కోరుకు ఆలౌట్ అయింది. ఆరంభం నుంచే తడబడుతూ ఆడిన శిఖర్ ధవన్ (9)ను నాలుగో ఓవర్లో లలిత్ యాదవ్ అవుట్ చేయడంతో పంజాబ్ పతనం మొదలైంది. ఆ తర్వాత తనకు దక్కిన శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (22) మరోసారి నిరాశపరిచాడు.
ఎన్నో అంచనాలు పెట్టుకున్న జానీ బెయిర్స్టో (9), లియామ్ లివింగ్స్టన్ (2) కూడా విఫలమయ్యారు. ఇలాంటి సమయంలో కాసేపు జట్టును ఆదుకున్న జితేష్ శర్మ (32)ను ఖలీల్ అహ్మద్ అవుట్ చేశాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ విజృంభించి.. ఒకే ఓవర్లో రబాడ (2), నాథన్ ఎలిస్ (0)ను పెవిలియన్ చేర్చాడు. పంజాబ్ ఇన్నింగ్స్లోని ఏకైక సిక్సర్ బాదిన రాహుల్ చాహర్ (12)ను కూడా లలిత్ యాదవ్ అవుట్ చేశాడు.
ఇన్నింగ్స్ చివరి బంతికి అర్షదీప్ సింగ్ (9) రనౌట్ అవడంతో పంజాబ్ ఆలౌట్ అయింది. మొత్తమ్మీద ఈ జట్టు 20 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌట్ అయింది. ఇది ఈ సీజన్లో ఇప్పటి వరకు అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఒక వికెట్ తీసుకున్నాడు.