న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ రీఎంట్రీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నెల 10 నుంచి యూపీలోని గోండాలో జరిగే నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ సిరీస్ టోర్నమెంట్తో పునరాగమనం చేసేందుకు సిద్ధం అవుతోంది. అయితే అంతర్జాతీయ డోపింగ్ నియంత్రణ మండలి (వాడా) నిబంధనల ప్రకారం రిటైర్మెంట్ ప్రకటించిన ప్లేయర్ల్లు రీఎంట్రీకి ఆరు నెలల ముందు నోటీస్ ఇవ్వాలనే రూల్ ఆమెకు అడ్డుగా మారే అవకాశం ఉంది.
2024 పారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో ఓవర్ వెయిట్ కారణంగా అనర్హతకు గురైన తర్వాత ఫొగాట్ ఆటకు వీడ్కోలు ప్రకటించింది. అనంతరం హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె పునరాగమనం చేస్తానని గతేడాది డిసెంబర్లో ప్రకటించింది.
గోండా నేషనల్ ర్యాంకింగ్ టోర్నీలో 57 కేజీ కేటగిరీలో తన పేరు నమోదు చేసుకుంది. అయితే వాడా నిబంధన 5.6.1 ప్రకారం రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (ఆర్టీపీ)లో ఉన్న ఎలైట్ ప్లేయర్ రీఎంట్రీకి ఆరు నెలల ముందే డోపింగ్ టెస్టుకు అందుబాటులో ఉంటామని సంబంధిత అంతర్జాతీయ, జాతీయ డోపింగ్ నిరోధక సంస్థలకు లిఖిత పూర్వకంగా తెలియజేయాలి. కానీ, దీని నుంచి మినహాయింపు కోరే అవకాశం కూడా సదరు అథ్లెట్కు ఉంటుంది. అయితే, వినేశ్ ఆరు నెలల నోటీస్ ఇచ్చిందా? మినహాయింపు కోరిందా? అనే విషయాలపై ఇప్పటికీ స్పష్టత లేదు.