కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో విజయం మనకే దక్కింది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత బాక్సర్ శివ థాప అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 28 ఏళ్ల శివ.. పాకిస్తాన్ బాక్సర్ సులేమాన్ బలోచ్ను మట్టికరిపించాడు.
రౌండ్ ఆఫ్ 32లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో 5-0 పాయింట్ల తేడాతో శివ విజయం సాధించాడు. ఈ ఏడాది జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో ఇదే భారత్ ఆడిన తొలి బాక్సింగ్ మ్యాచ్ కావడం గమనార్హం. ఈ మ్యాచ్లో విజయం సాధించిన శివ.. ఆదివారం నాడు స్కాట్లాండ్కు చెందిన రీస్ లించ్ను రౌండ్ ఆఫ్ 16లో భాగంగా ఎదుర్కొంటాడు.