కామన్వెల్త్ క్రీడల్లో ఫైనల్ చేరిన భారత మహిళల క్రికెట్ జట్టు.. గోల్డ్ మెడల్ కోసం జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియాను పూర్తిగా కట్టడి చెయ్యలేకపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా మహిళలకు.. శుభారంభం దక్కలేదు. అలిస్సా హేలీ (7)ని రేణుకా సింగ్ త్వరగానే వెనక్కు పంపింది. అయితే మరో ఓపెనర్ బెత్ మూనీ (61) రాణించింది. ఆమెకు జతకలిసిన కెప్టెన్ మెగ్ లానింగ్ (36) కూడా మంచి ఇన్నింగ్స్ ఆడింది.
తహీలీ మెక్గ్రాత్ (2), గ్రేస్ హ్యారిస్ (2), అలానా కింగ్ (1) విఫలమవగా.. ఆష్లే గార్డనర్ (25), రచెల్ హేన్స్ (15 నాటౌట్) వేగంగా ఆడారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా మహిళలు 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ, రాధా యాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్ గెలిస్తే భారత మహిళలు బంగారు పతకం సాధిస్తారు.