Wasim Akram: వన్డే వరల్డ్ కప్లో సెమీఫైనల్ రేసు నుంచి అనధికారికంగా దూరమైన పాకిస్తాన్ జట్టు సెమీస్ చేరడానికి దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్.. బాబర్ సేనకు కీలక సూచనలు చేశాడు. బుధవారం బెంగళూరు వేదికగా శ్రీలంక – న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో కివీస్ ఘనవిజయం సాధించడంతో పాక్ సెమీస్ ఆశలు అడియాసలయ్యాయి. ఇప్పుడు పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే ఇంగ్లండ్పై భారీ విజయమే లక్ష్యంగా ఆడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్రమ్ మాట్లాడుతూ.. తాను చెప్పింది చేయడం తప్పితే పాకిస్తాన్ సెమీఫైనల్ చేరడం అసాధ్యమని అన్నాడు.
కివీస్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత ఓ టీవీ ఛానెల్ చర్చలో పాల్గొన్న అక్రమ్.. ‘ఈ మ్యాచ్లో పాకిస్తాన్ భారీ తేడాతో గెలిచి సెమీస్ కు అర్హత సాధించాలంటే ఒక్కటే మార్గం ఉంది. ఈ మ్యాచ్లో పాక్ ముందు బ్యాటింగ్ చేసి ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలి. ఆ తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లను డ్రెస్సింగ్ రూమ్లో ఉంచి తాళం వేయాలి. టైమ్డ్ ఔట్ అయ్యేదాకా ఉంచి అప్పుడు తాళం తీయాలి. అప్పుడు పాకిస్తాన్ సెమీస్కు వెళ్తుంది’ అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు. ఈ చర్చలో పాక్ మాజీ సారథి మిస్బా ఉల్ హక్ తో పాటు మోయిన్ ఖాన్, షోయభ్ మాలిక్ లు కూడా అక్కడే ఉన్నారు. అక్రమ్ ఈ మాట చెప్పడంతో వాళ్లు నవ్వు ఆపుకోలేకపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
How can Pakistan still qualify for the semi-finals? @wasimakramlive has a hilarious idea.#ASportsHD #ARYZAP #CWC23 #ThePavilion #WasimAkram #MoinKhan #FakhreAlam #MisbahulHaq #NZvSL pic.twitter.com/iaCH6CSZSa
— ASports (@asportstvpk) November 9, 2023
పాక్ సెమీస్ చేరాలంటే..?
శనివారం ఇంగ్లండ్ – పాకిస్తాన్ మధ్య కోల్కతా వేదికగా జరుగబోయే మ్యాచ్లో గెలిచి సెమీస్ చేరాలంటే పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేస్తే 287 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. అంటే ఉదాహరణకు పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేస్తే 300 పరుగులు చేసి ఇంగ్లండ్ను 13 పరుగులకే ఆలౌట్ చేయాలి. ఒకవేళ ఛేదనకు దిగాల్సి వస్తే ఇంగ్లండ్ నిర్దేశించే లక్ష్యాన్ని మూడు ఓవర్లలోనే ఛేదించాలి. అంటే ఇంగ్లండ్ నిర్దేశించే ఏ లక్ష్యాన్ని అయినా మూడు ఓవర్లలోపే ఛేదిస్తే అప్పుడు పాకిస్గాన్కు సెమీస్ అవకాశాలుంటాయి.