Virat Kohli: పరుగుల దాహంతో ఉన్న టీమిండియా రన్ మిషీన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుపై కన్నేశాడు. 2020 నుంచి 2022 వరకూ అత్యంత చెత్త ఫామ్తో విసిగించిన కోహ్లీ గత ఏడాది ఆసియా కప్ నుంచి మునపటి ఫామ్ అందుకోవడమే గాక రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతున్నాడు. ఇటీవలే ఈడెన్ గార్డెన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 49 సెంచరీ (వన్డేలలో)ల రికార్డును సమం చేసిన విరాట్.. న్యూజిలాండ్తో సెమీఫైనల్కు ముందు మరో ఘనతపై కన్నేశాడు. కోహ్లీ మరో 80 పరుగులు సాధిస్తే సింగిల్ వరల్డ్ కప్ ఎడిషన్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఉన్న సచిన్ రికార్డును బ్రేక్ చేస్తాడు.
2003 వరల్డ్ కప్ ఎడిషన్లో సచిన్.. 673 పరుగులతో చెలరేగాడు. ఇందులో ఏకంగా ఏడు అర్థ సెంచరీలున్నాయి. ఈ రికార్డుకు విరాట్ 80 రన్స్ దూరంలో ఉన్నాడు. 2023 వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ ఇప్పటికే 9 మ్యాచ్లలో 594 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇందులో ఏడు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లున్నాయి. ఈ మెగా టోర్నీలో విరాట్.. ఐదు అర్థ సెంచరీలు, రెండు సెంచరీలు చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ విరాట్.. మరో 55 పరుగులు చేసినా రోహిత్ శర్మ 2019లో చేసిన 648 పరుగుల రికార్డును బ్రేక్ చేస్తాడు. మరి కోహ్లీ సచిన్, హిట్మ్యాన్ రికార్డులను అధిగమిస్తాడా తెలియాలంటే నవంబర్ 15 దాకా వేచి చూడాల్సిందే.
సింగిల్ వరల్డ్ కప్ ఎడిషన్లో అత్యధిక పరుగుల వీరులు :
సచిన్ టెండూల్కర్ – 673 (2003)
మాథ్యూ హెడెన్ – 659 (2007)
రోహిత్ శర్మ – 648 (2019)
డేవిడ్ వార్నర్ – 647 (2019)
షకిబ్ అల్ హసన్ – 606 (2019)
విరాట్ కోహ్లీ – 594 (2023)