SL vs NED | వన్డే వరల్డ్ కప్లో శ్రీలంక బోణీ కొట్టింది. నెదర్లాండ్స్తో లక్నోలోని ఏకనా స్టేడియం వేదికగా ముగిసిన మ్యాచ్లో డచ్ జట్టు నిర్దేశించిన 263 పరుగుల లక్ష్యాన్ని లంకేయులు.. 48.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకున్నారు. మోస్తారు లక్ష్య ఛేదనలో సదీర సమరవిక్రమ (107 బంతుల్లో 91, 7 ఫోర్లు), పతుమ్ నిస్సంక (52 బంతుల్లో 54, 9 ఫోర్లు), చరిత్ అసలంక (66 బంతుల్లో 44, 2 ఫోర్లు, 1 సిక్సర్) ధనంజయ డిసిల్వ (37 బంతుల్లో 30, 1 ఫోర్, 2 సిక్సర్లు)లు రాణించారు.
ఏకనా స్టేడియం వేదికగా ముగిసిన ఈ మ్యాచ్లో నెదర్లాండ్స్ తొలుత బ్యాటింగ్ చేసి 49.4 ఓవర్లలో 262 పరుగులు చేసింది. టాపార్డర్ విఫలమైనా లోయరార్డర్ బ్యాటర్లు సిబ్రండ్ (70), వాన్ బీక్ (59)లు డచ్ను ఆదుకున్నారు. లంక బౌలర్లలో మధుశంక, రజితలు తలా నాలుగు వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్య ఛేదనలో లంక 4వ ఓవర్లోనే కుశాల్ పెరీరా (5) వికెట్ కోల్పోయింది. కెప్టెన్ కుశాల్ మెండిస్ (11) కూడా విఫలమయ్యాడు. కానీ నిస్సంకతో కలిసి సమరవిక్రమ మూడో వికెట్ కు 52 పరుగులు జోడించాడు. ఆ తర్వాత అసలంకతోనూ 77 పరుగులు జతచేసి లంకను విజయపథంలో నడిపించాడు. ధనంజయ డిసిల్వతో ఐదో వికెట్కు 76 పరుగులు జోడించిన సమరవిక్రమ మ్యాచ్ను ముగించి లంకకు తొలి విజయాన్ని అందించాడు. కాగా స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో డచ్ బౌలర్లు చివరిదాకా లంకను కట్టడి చేశారు. కానీ కీలక దశలో వికెట్లు తీయడంలో విఫలమైన ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.