Babar Azam: వన్డే ప్రపంచకప్లో వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలను ఎదుర్కుంటున్న పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మరో షాకిచ్చేందుకు సిద్ధమైందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. వరల్డ్ కప్లో భారీ ఆశలతో భారత్లో అడుగుపెట్టిన పాకిస్తాన్ను విజయవంతంగా నడిపిస్తాడని ఆశించినా బాబర్ మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. వ్యక్తిగత ప్రదర్శనతో పాటు అతడు టీమ్ను నడిపించే విధానంపైనా విమర్శలు వస్తున్న నేపథ్యంలో పీసీబీ కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం. బాబర్ను కెప్టెన్సీ నుంచి తప్పించేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తున్నది.
వరల్డ్కప్లో ఇప్పటివరకూ ఐదు మ్యాచ్లు ఆడిన పాకిస్తాన్.. నెదర్లాండ్స్, శ్రీలంక పై మాత్రమే నెగ్గింది. ఈనెల 14న అహ్మదాబాద్లో భారత్తో జరిగిన మ్యాచ్లో ఓడిన బాబర్ సేన ఆ తర్వాత వరుసగా ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్ల చేతిలోనూ చావుదెబ్బతింది. అఫ్గాన్ చేతిలో ఓటమితో పాకిస్తాన్పై ఆ జట్టు మాజీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబర్ కెప్టెన్సీ మెటిరియల్ కాదని, అతడి వ్యూహాలు అత్యంత చెత్తగా ఉన్నాయంటూ విరుచుకుపడ్డారు. ప్రస్తుతం పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే అవకాశాలు తక్కువే అయినా ఆ ఆశలు నిలుపుకోవాలంటే తర్వాత ఆడబోయే నాలుగు మ్యాచ్లలోనూ గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపైనా ఆధారపడిఉంది.
బాబర్ సారథ్యంపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో పీసీబీ కూడా వరల్డ్ కప్ తర్వాత కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు తాజాగా హింట్ కూడా ఇచ్చింది. తాజాగా పీసీబీ ఓ ప్రకటన విడుదల చేస్తూ.. జట్టు ప్రయోజనాల కోసం ప్రపంచకప్ తర్వాత కీలక మార్పులు ఉంటాయని ప్రకటించింది. పీసీబీ వర్గాల సమాచారం ప్రకారం బాబర్ ను కెప్టెన్గా తప్పించి ఆ బాధ్యతలు వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్కు గానీ స్టార్ పేసర్ షహీన్ షా అఫ్రిదికి గానీ అప్పజెప్పే అవకాశాలున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా సెమీస్ చేరేందుకు ఇప్పటికైతే తమకింకా తలుపులు మూసుకుపోలేదని పాకిస్తాన్ జట్టుకు అభిమానుల మద్దతు ఉండాలని పీసీబీ కోరింది.