CWC 2023: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్లో లీగ్ దశ పోటీలు ముగిసి మరో రెండు రోజుల్లో నాకౌట్ పోటీలు మొదలుకానున్నాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్.. నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్తో ఈనెల 15న ముంబైలోని వాంఖెడే వేదికగా తొలి సెమీస్లో తలపడనుంది. ఐసీసీ టోర్నీలలో భారత్కు కివీస్పై రికార్డు ఎలా ఉంది..? ఇండియా – న్యూజిలాండ్ మధ్య ఐసీసీ టోర్నీలలో ఆధిపత్యం ఎవరిది..? వంటి విషయాలు ఇక్కడ చూద్దాం.
వన్డే వరల్డ్ కప్లలో..
తొలి వన్డే వరల్డ్ కప్ జరిగిన 1975 నుంచి భారత్.. న్యూజిలాండ్లు తలపడుతున్నాయి. ఈ ఇరు జట్ల మధ్య 10 మ్యాచ్లలో భారత్ నాలుగు గెలవగా కివీస్ ఐదు గెలిచింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. 1975, 1979లలో భారత్పై కివీస్ పైచేయి సాధించగా భారత్ తొలిసారి వన్డే వరల్డ్ కప్ గెలిచిన 1983లో రెండు మ్యాచులలో కివీస్ను ఓడించింది. కానీ ఆ తర్వాత 1992, 1999 లలో మళ్లీ న్యూజిలాండ్ గెలిచింది. 2003లో భారత్ విజయం సాధించింది. 2019లో గ్రూప్ దశలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. కానీ సెమీస్ మ్యాచ్ను మాత్రం భారత అభిమానులు ఇప్పట్లో మరిచిపోరు. ధోని రనౌట్తో భారత విజయావకాశాలు కుప్పకూలాయి. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 239 పరుగులే చేసింది. లక్ష్య ఛేదనలో భారత్.. 49.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా కివీస్ 18 పరుగులు తేడాతో విజయం సాధించింది.
ఛాంపియన్స్ ట్రోఫీలోనూ..
భారత్-న్యూజిలాండ్లు ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్కసారి మాత్రమే తలపడ్డాయి. 1998 ఎడిషన్లో ఇరుజట్ల మధ్య ఫైనల్ జరిగింది. కానీ ఫైనల్లో భారత్కు ఓటమి తప్పలేదు.
పొట్టి ఫార్మాట్లలో..
టీ20 వరల్డ్ కప్లలో కివీస్.. భారత్పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఇప్పటివరకూ టీ20 ప్రపంచకప్లలో ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్లు జరుగగా మూడింటిలోనూ కివీస్ దే విజయం.
టెస్ట్ ఛాంపియన్షిప్లో..
2019లో భారత్ను దెబ్బకొట్టిన కివీస్.. మరోసారి 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కూడా షాకిచ్చింది. ఆ ఏడాది ఇంగ్లండ్లో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్స్లో భారత్ను ఓడించి టైటిల్ను సొంతం చేసుకుంది.
2023లో..
కివీస్పై భారత్కు ఘనమైన రికార్డు లేకున్నా ప్రస్తుతం స్వదేశంలో టీమిండియా అదరగొడుతోంది. గ్రూప్ దశలో అపజయమే లేని భారత్.. కొద్దిరోజుల క్రితమే ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లో ఆ జట్టును ఓడించింది. రోహిత్, గిల్, కోహ్లీ, శ్రేయస్, రాహుల్లు ఫామ్లో ఉండటం.. పేస్ త్రయం షమీ, సిరాజ్, బుమ్రాలతో పాటు స్పిన్నర్లు కుల్దీప్, రవీంద్ర జడేజాలు జోరుమీదున్నారు. ఈ జోరు ఇలాగే కొనసాగితే ఐసీసీ టోర్నీలలో కివీస్ గండాన్ని దాటడం పెద్ద కష్టమేమీ కాదు.