ప్రపంచ చాంపియన్గా నిలిచిన తమ దేశ రగ్బీ జట్టును స్ఫూర్తిగా తీసుకున్న దక్షిణాఫ్రికా మెగాటోర్నీలో దుమ్మురేపుతున్నది. న్యూజిలాండ్ను మట్టికరిపిస్తూ సెమీస్ రేసులో టాప్గేర్లో దూసుకెళుతున్నది. డస్సెన్, డికాక్ సెంచరీలతో పుణెలో మోత మోగించిన సఫారీలు..కివీస్ను సఫా చేశారు. వీరిద్దరు చెలరేగడంతో భారీ స్కోరు అందుకున్న దక్షిణాఫ్రికా..బౌలింగ్లోనూ చెలరేగి కివీస్కు హ్యాట్రిక్ ఓటమి కట్టబెట్టారు.
పుణె: దక్షిణాఫ్రికాకు తొలుత బ్యాటింగ్ చేసే అవకాశమిస్తే..పూనకం వచ్చినట్లు చెలరేగుతారని తెలిసినా..న్యూజిలాండ్ అదే పనిచేసి చేతులు కాల్చుకుంది. బుధవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా 190 పరుగుల తేడాతో కివీస్ను చిత్తుగా ఓడించింది. తొలుత డస్సెన్(172 బంతుల్లో 133, 9ఫోర్లు, 5సిక్స్లు), డికాక్(116 బంతుల్లో 114, 10ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీలతో దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 357/4 భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ బవుమా(24) నిరాశపరిచినా..డికాక్, డస్సెన్ వీరవిహారం చేశారు. మెగాటోర్నీలో డికాక్కు ఇది నాలుగో సెంచరీ కాగా, డస్సెన్కు రెండోది. ఆఖర్లో మిల్లర్(53)హార్డ్హిట్టింగ్తో దక్షిణాఫ్రికా 350 మార్క్ అందుకుంది. సౌథీ(2/77) ఫర్వాలేదనిపించాడు. ఆ తర్వాత లక్ష్యఛేదనలో కివీస్..35.3 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూలింది. కేశవ్ మహారాజ్(4/46), జాన్సెన్(3/31) ధాటికి కివీస్ బ్యాటర్లు నిలదొక్కుకోలేకపోయారు. గ్లెన్ ఫిలిప్స్(60) ఒంటరిపోరాటం జట్టును గెలిపించలేకపోయింది.
దక్షిణాఫ్రికా: 50 ఓవర్లలో 357/4(డస్సెన్ 133, డికాక్ 114, సౌథీ 2/77, బౌల్ట్ 1/49),
న్యూజిలాండ్: 35.3 ఓవర్లలో 167 ఆలౌట్(ఫిలిప్స్ 60, యంగ్ 33, మహారాజ్ 4/46, జాన్సెన్ 3/31)