INDvsNZ: వన్డే ప్రపంచకప్ లీగ్ దశ ముగిసి నాకౌట్ దశకు రంగం సిద్ధమైంది. భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్ చేరాయి. తొలి సెమీఫైనల్లో భాగంగా ఇండియా.. న్యూజిలాండ్తో వాంఖెడే వేదికగా తలపడనుంది. భారత్కు ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీలలో ఇది ఎనిమిదో సెమీస్. వరుసగా నాలుగో సెమీస్. మరి గత ఏడు సెమీఫైనల్స్లలో భారత ప్రదర్శన ఎలా ఉంది..? ఎన్ని మ్యాచ్లు గెలిచింది..?
ఎనిమిదోసారి..
1975 నుంచి మొదలైన ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీలలో భారత్.. 1983లో తొలిసారిగా సెమీస్ చేరింది. ఇప్పటివరకూ భారత్ ఏడు సెమీస్లు ఆడింది. బుధవారం ఆడబోయే సెమీస్ టీమిండియాకు ఎనిమిదోవది. ఏడు సెమీస్లలో మూడింటిలో గెలిచి నాలుగింటిలో ఓడింది. ఆ వివరాలు ఇవిగో..
1983లో భారత్.. ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా ఇంగ్లండ్తో ముగిసిన మ్యాచ్ లో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. 213 పరుగులు చేయగా.. భారత్ 54.4 ఓవర్లలో 217 పరుగులు చేసి ఫైనల్స్కు అర్హత సాధించడమే గాక తుదిపోరులో విండీస్ను ఓడించి తొలి వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది.
1987లో ప్రస్తుతం కివీస్తో మ్యాచ్ జరగాల్సి ఉన్న వాంఖెడేలోనే ఇంగ్లండ్తో సెమీస్ ఆడింది. ఆ మ్యాచ్లో ఇంగ్లండ్.. 254 పరుగులు చేయగా భారత్ 219 పరుగులకే కుప్పకూలింది.
1996లో కోల్కతా వేదికగా భారత్ – శ్రీలంకలు తలపడగా తొలుత బ్యాటింగ్ చేసిన లంక 251 పరుగులు చేయగా భారత్.. 34.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. భారత్ ఓటమి దిశగా సాగుతుండటం చూసి తట్టుకోలేకపోయిన భారత అభిమానులు ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్కు అంతరాయం కలిగించారు. దీంతో అంపైర్లు లంకను విజేతగా ప్రకటించారు.
2003 వరల్డ్కప్లో భారత్.. కెన్యాతో సెమీస్ ఆడింది. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కెన్యా 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 225 పరుగులుచేయగా లక్ష్యాన్ని భారత్.. 47.5 ఓవర్లలో ఛేదించింది. నాటి భారత సారథి గంగూలీ ఈ మ్యాచ్లో అజేయ శతకంతో మ్యాచ్ను గెలిపించాడు.
2011లో భారత్.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 260 పరుగులకే పరిమితం అయినా భారత బౌలర్ల కృషితో పాకిస్తాన్ 231 పరుగులకే ఆలౌట్ అయింది.
2015లో ఆస్ట్రేలియాతో టీమిండియా సెమీస్ ఆడింది. ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 328 పరుగులు చేసింది. అనంతరం భారత్.. 46.5 ఓవర్లలో 233 పరుగులకే ఆలౌట్ అయింది.
ఇక 2019 ప్రపంచకప్లో కోహ్లీ సేన.. కివీస్తో సెమీస్ ఆడింది. ఈ మ్యాచ్లో భారత బౌలర్ల కృషితో కివీస్ 50 ఓవర్లలో 239 పరుగులకే పరిమితం చేయగా లక్ష్య ఛేదనలో భారత్ తడబడింది. 49.3 ఓవర్లలో 221 పరుగులకే చాపచుట్టేసింది. ఈ మ్యాచ్లో ధోని రనౌట్ ఇప్పటికీ భారత అభిమానులకు ఓ పీడకలలా వేధిస్తూనే ఉంది. ఆ ఓటమికి బదులు తీర్చుకునేందుకు భారత్ సిద్ధమవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.