ముంబై: టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా వద్ద ఉన్న రెండు అతిఖరీదైన వాచీలను ముంబై కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. చేతికి పెట్టుకునే ఆ రెండు వాచీల ఖరీదు సుమారు అయిదు కోట్లు ఉంటుంది. దుబాయ్ నుంచి తిరిగివస్తున్న హార్దిక్ను ఆదివారం రాత్రి ముంబై విమానాశ్రయంలో అధికారులు ప్రశ్నించారు. ఆల్రౌండర్ పాండ్యా వద్ద ఆ విలువైన వాచీలకు చెందిన బిల్లులు లేవని అధికారులు తెలిపారు. టీ20 వరల్డ్కప్లో ఆడేందుకు హార్దిక్ పాండ్యా దుబాయ్ వెళ్లిన విషయం తెలిసిందే.
స్విట్జర్లాండ్కు చెందిన పటేక్ ఫిలిప్ కంపెనీ వాచీలను ప్యాండా తనతో తీసుకువస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వాచీల మీద ఉన్న సీరియల్ నెంబర్లు, ఇన్వాయిస్లో ఉన్న నెంబర్ల మధ్య తేడా ఉన్న కారణంగా ఆ వాచీలను సీజ్ చేశారు. ఆ వాచీలు తన వద్ద ముందు నుంచే ఉన్నాయని, అందులో ఒకదాని ఖరీదు 1.4 కోట్లు అని, మరో వాచీ ఖరీదు సుమారు 40 లక్షలు ఉంటుందని హార్దిక్ తెలిపాడు.
ఇన్వాయిస్లో నెంబర్లు తేడా ఉన్నందు వల్ల.. హార్దిక్ మరోసారి సరిచేసిన బిల్లును అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఈ ఖరీదైన వాచీలపై ప్రభుత్వం 38 శాతం పన్ను వసూల్ చేస్తుంది. ఒకవేళ పాండ్యా ఆ విలాసవంతమైన వాచీలకు చెందిన సరైన బిల్లులను సమర్పించలేని పక్షంలో ఆ వాచీలను అధికారులు పూర్తిగా సీజ్ చేయనున్నారు.
క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఈ ఘటనపై తాజాగా ప్రకటన రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో తన గురించి తప్పుడు ప్రచారం సాగుతోందన్నారు. ముంబై ఎయిర్పోర్ట్ కస్టమ్స్ శాఖకు తానే స్వయంగా వెళ్లానని, తాను తీసుకువచ్చిన ఐటమ్స్ గురించి కస్టమ్స్ డ్యూటీ కట్టేందుకు అక్కడకు వెళ్లినట్లు హార్ధిక్ తన ట్విట్టర్లో వివరణ ఇచ్చారు. చట్టబద్దంగానే దుబాయ్లో వాచీలు కొన్నానని, వాటికి డ్యూటీ కస్టమ్ కట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు క్రికెటర్ చెప్పాడు.
కస్టమ్స్ అధికారులు అడిగిన డాక్యుమెంట్లు ఇచ్చానని, అధికారులు ఆ రసీదులను పరిశీలిస్తున్నట్లు తెలిపాడు. తాను తెచ్చిన వాచీ ఖరీదు 1.5 కోట్లు మాత్రమే అని, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు ఆ వాచీల ఖరీదు 5 కోట్లు కాదన్నాడు. చట్ట ప్రకారం నడుచుకుంటానని, ప్రభుత్వ ఏజెన్సీలను గౌరవిస్తానని, తనపై వస్తున్న ప్రచారాలను నమ్మవద్దు అంటూ ఓ ప్రకటనలో హార్ధిక్ తెలిపాడు.