Chennai Super Kings : ఐపీఎల్లో తిరుగులేని చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) 17వ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్గా అడుగు పెట్టనుంది. ఆ జట్టుకు ఐదు ట్రోఫీలు అందించిన మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)కి బహుశా ఇదే ఆఖరి సీజన్ కావొచ్చు. దాంతో, ‘చెన్నై భావి కెప్టెన్ ఎవరు?’ అనే చర్చ అభిమానుల్లో మొదలైంది. ఒక రోజు క్రిత సీఎస్కే మాజీ ఆటగాడు అంబటి రాయుడు(AambatiRayudu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘రోహిత్ శర్మను ఎల్లో జెర్సీలో చూడాలని ఉంద’ని అతడు అన్నాడు. దాంతో, ‘ధోనీ వారసుడు ఎవరు?’ అనే ప్రశ్నకు ఫుల్స్టాప్ పెట్టాలని సీఎస్కే నిర్ణయించుకుంది.
తాజాగా చెన్నై ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథన్ ఒక యూట్యూబ్ షోలో మాట్లాడుతూ.. ‘ధోనీ తర్వాత కెప్టెన్ ఎవరు? అనే విషయమై చర్చిస్తున్నాం. అయితే.. చెన్నై భావి సారథి ఎవరు? అనే విషయమై మా యజమాని ఎన్ శ్రీనివాసన్(N Srinivasan) ఒక మేసెజ్ ఇచ్చాడు’ అని వెల్లడించాడు.
ధోనీ, శ్రీనివాసన్
‘అవును.. సీఎస్కే కొత్త కెప్టెన్ గురించి అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. ఈ సమయంలో మా ఓనర్ శ్రీనివాసన్ స్పష్టంగా ఒకటే చెప్పాడు. సకెప్టన్, వైస్ కెప్టెన్ ఎవరు? అనే విషయాలు మాట్లాడొద్దు. ఆ అంశాన్ని కెప్టెన్, కోచ్లకు వదిలేద్దాం. వాళ్లు నిర్ణయం తీసుకొని నాకు చెప్తారు. ఆ మెసేజ్ను నేను మీ అందరికీ వెల్లడిస్తాను. అప్పటివరకూ అందరం మౌనంగా ఉందాం’ అని శ్రీనివాసన్ అన్నారని విశ్వనాథన్ చెప్పుకొచ్చాడు.
ధోనీ తర్వాత చెన్నై జట్టులో అనుభవజ్ఞుడు ఎవరంటే అది రవీంద్ర జడేజానే. ఆల్రౌండర్గా చెన్నై విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న జడ్డూ.. నిరుడు ఫైనల్లో ఖతర్నాక్ ఇన్నింగ్స్తో జట్టుకు ఐదో ట్రోఫీ అందించాడు. దాంతో, సీఎక్కే భావి కెప్టెన్గా అతడే సరైనోడు అని కొందరు అంటున్నారు. కానీ, 2022లో జడేజా సారథిగా విఫలమయ్యాడు. దాంతో, మేనేజ్మెంట్ మళ్లీ ధోనీకే పగ్గాలు అప్పగించింది.
అయితే.. 17వ సీజన్తో మహీ భాయ్ రిటైర్మెంట్ ప్రకటించే చాన్స్ ఉంది. మరి సారథిగా జడేజాకు అవకాశం దక్కేనా? లేదంటే కుర్రాడు రుతురాజ్ గైక్వాడ్కు కెప్టెన్సీ ఇస్తారా? అని అభిమానులు జోరుగా చర్చించుకుంటున్నారు. ఏదిఏమైనా 2024 ఎడిషన్ తర్వాతే సీఎస్కే యాజమాన్యం కొత్త కెప్టెన్ పేరు ప్రకటిస్తారని సమాచారం. ఐపీఎల్ 17వ సీజన్లో ధోనీ సేన టైటిల్ ఫేవరెట్గా అడుగుపెట్టనుంది. మార్చి 22న జరిగే తొలి పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సీఎస్కే తలపడనుంది.