Ajit Chandila : ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో మాజీ స్పిన్నర్ అజిత్ చండీలాకు భారీ ఊరట లభించింది. అతనిపై విధించిన జీవితకాల నిషేధాన్ని బీసీసీఐ అంబుడ్స్మన్ వినీత్ శరణ్ ఏడేళ్లకు తగ్గించాడు. 2013 ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ఆడుతున్న చండీల, మాజీ క్రికెటర్ శ్రీశాంత్, అంకిత్ చవాన్తో కలిసి స్పాట్ ఫిక్సింగ్లో భాగం అయ్యాడు. దాంతో, అతడిపై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది.
అయితే.. బాంబే హై కోర్టు నుంచి అనుకూల తీర్పు రావడంతో చండీల బీసీసీఐ అంబుడ్స్మన్ను ఆశ్రయించాడు. తనపై విధించిన నిషేధాన్ని తగ్గించాలని అతను విన్నవించుకున్నాడు. అతని అభ్యర్తనను స్వీకరించిన అంబుడ్స్మన్ నిషేధాన్ని తగ్గిస్తూ నిర్ణయం వెల్లడించాడు. ఇప్పటికే అంకిత్ చవాన్, శ్రీశాంత్పై బీసీసీఐ నిషేధం ఎత్తేసిన విషయం తెలిసిందే.
2013 ఐపీఎల్లో కీలక బుకీ నుంచి రూ. 25 లక్షలు తీసుకున్నాడని అజిత్ చండీలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. చండీల ఆ బుకీ చెప్పినట్టుగా చేయనుందుకు అతడికి రూ.20 లక్షలు తిరిగిచ్చేశాడు. మిగతా రూ.5 లక్షలు తర్వాత ఇస్తానని చెప్పాడు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న బీసీసీఐ అతనిపై జీవిత కాల నిషేధం విధించింది. ఈ క్రికెటర్ బుకీ నుంచి డబ్బులు తీసుకున్నాడనే విషయాన్ని పోలీసులు ఢిల్లీ కోర్టులో నిరూపించలేకపోయారు. దాంతో, కోర్టులో తీర్పు చండీలకు అనుకూలంగా వచ్చింది. అందుకని అతను తనపై జీవితకాల నిషేధాన్ని తగ్గించాలని బీసీసీఐ అంబుడ్స్మన్ తలుపు తట్టాడు.
‘నేను ఎంత సంతోషంగా ఉన్నాను అనేది చెప్పలేను. నా పొరపాటు ఏం లేకున్నా కూడా ఇన్నాళ్లు నేను, నా కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. విధిని ఎవరు తప్పించగలరు. అయితే.. దేవుడు నా వైపు ఉన్నాడు. నాపై ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో దగ్గరి వాళ్లు కూడా దూరం అయ్యారు. అలాగని నేను బాధ పడడం లేదు. ఎందుకంటే మనందరం చనిపోయేటప్పుడు ఖాళీ చేతులతోనే వెళ్తాం’ అని చండీల అన్నాడు.