న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీలో చేరుతున్నాడని వచ్చిన వార్తలను భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కొట్టిపడేశాడు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తమన్నాడు. అయితే, 2017 అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో హర్భజన్ కాంగ్రెస్లో చేరనున్నట్లు వార్తలు వచ్చాయి. జలంధర్కు చెందిన హర్భజన్ సింగ్ త్వరలోనే అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు.
ఈ క్రమంలో పంజాబ్ఎన్నికల్లో హర్భజన్ సింగ్ బీజేపీ నుంచి పోటీ చేస్తాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో టర్బోనేటర్ నేరుగా రంగంలోకి సామాజిక మధ్యమాల్లో వస్తున్న వార్తలను ఖండించాడు. నేను బీజేపీలో చేరుతానన్న చర్చ పూర్తిగా తప్పని, తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశాడు.
ఇదిలా ఉండగా.. ఈ సారి బీజేపీ తన మాజీ మిత్రపక్షమైన శిరోమణి అకాళీదళ్తో పొత్తు లేకుండానే వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికల్లో బరిలోకి దిగనున్నది. ఈ నేపథ్యంలో ముఖ పరిచయం ఉన్న సిక్కులను పార్టీలో చేర్చుకోవాలని చూస్తున్నది. ఇందులో భాగంగానే బీజేపీ నేతలు హర్భజన్తో చర్చలు జరిపినట్లు తెలుస్తున్నది. అయితే, పలువురు ప్రముఖులు కొందరు పార్టీ నేతలతో టచ్లో ఉన్నారని కాషాయ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎవరి పేర్లు మాత్రం బయటకు వెల్లడించలేదు.