రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని భయపెడుతూనే ఉంది. ఈ భయంతో క్రికెట్లో కూడా చాలా నిబంధనలు మారాయి. అంతకుముందు బౌలింగ్ చేసే సమయంలో ఫీల్డర్లు, బౌలర్లు బంతికి ఉమ్మి రాసేవారు. బంతి మరింత స్పిన్ అయ్యేందుకు ఇలా చేసేవాళ్లు. అయితే కరోనా ఉమ్మి ద్వారా సోకుతుందని తేలడంతో.. ఇలా బంతికి ఉమ్మి రాయడాన్ని ఐసీసీ నిషేధించింది.
ఈ మేరకు క్రికెట్ క్రీడకు సంబంధించి నియమనిబంధనలు అమలు చేసే మేరీలెబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) నిబంధనల్లో పేర్కొంది. తాజాగా విడుదలైన ఎంసీసీ నిబంధనల్లో కూడా దీన్ని కొనసాగించారు. ‘‘బంతికి ఉమ్మి రాయడం వల్ల అది ఎక్కువ స్వింగ్ అవడం జరగదని పరిశీలనలో తేలింది. అందుకే ఇకపై కూడా బంతికి ఉమ్మి రాయడాన్ని నిషేధిస్తున్నాం.
ఇటీవలి కాలంలో బంతికి చెమట రాస్తున్నారు. అది రాసినా, ఉమ్మి రాసినా ఫలితం ఒకటే. కాబట్టి ఇకపై కూడా బంతికి ఉమ్మి రాయకూడదని నిర్ణయించాం’’ అని ఎంసీసీ ప్రకటనలో పేర్కొంది. దీంతో బంతికి రాసే ఉమ్మిలో తేడా వచ్చేందుకు ఫీల్డర్లు తీపి పదార్థాలు తినడం జరిగేది. తాజా నిబంధనతో ఇకపై ఇది కూడా ఆగిపోయే అవకాశం ఉంది.