Cricket Australia : సొంతగడ్డపై న్యూజిలాండ్పై చారిత్రాత్మక టెస్టు విజయం(Historic Test Win) నమోదు చేసిన బంగ్లాదేశ్.. తమను తక్కువ అంచనా వేయొద్దని మరోసారి చాటింది. గత కొంత కాలంగా వన్డేలు, టీ20లతో పాటు టెస్టు ఫార్మాట్లోనూ రాణిస్తున్న బంగ్లా 2027లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అయితే.. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు(Cricket Australia) ఆ టెస్టు సిరీస్ను రీ-షెడ్యూల్ చేయాలని మంగళవారం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(Bangladesh Cricket Board)ను అభ్యర్థించింది.
తమ జట్టును 2026 ఆగస్టు, సెప్టెంబర్ మధ్య ఆసీస్కు పంపాలని బీసీబీని కోరింది. కంగారూ బోర్డు ప్రతిపాదనపై బంగ్లా క్రికెట్ బోర్డు ఇంకా బదులివ్వాల్సి ఉంది. ‘ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఇరుదేశాల మధ్య 2027లో జరిగాల్సిన టెస్టు సిరీస్ను ముందుకు జరపాలని కోరింది. అదే ఏడాది వేసవిలో ఇంగ్లండ్తో 150వ టెస్టు మ్యాచ్ నిర్వహించాలనే ఆలోచనతో ఆసీస్ బోర్డు మమ్మల్ని ముందస్తు సిరీస్ కోసం అభ్యర్థించింది. అదే విషయం సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నాం’ అని బీసీబీ చీఫ్ నిజాముద్దీన్ చౌదురి( Nizamuddin Chowdhury) తెలిపాడు.
టెస్టు హోదా వచ్చాక బంగ్లాదేశ్ ఇప్పటివరకూ కంగారూల గడ్డపై ఒకే ఒక టెస్ట్ సిరీస్ ఆడింది. 2003లో బంగ్లా జట్టు రెండు టెస్టుల కోసం ఆసీస్ వెళ్లింది. అయితే.. 2018లో ఇరుజట్లు వన్డే, టెస్టు సిరీస్లో తలపడాల్సి ఉన్నా.. వివాదాల కారణంగా సిరీస్ రద్దయ్యింది. మరోవైపు 2015లో ఆస్ట్రేలియా భద్రతా కారణాలతో బంగ్లా పర్యటనకు రాలేదు. రెండేండ్ల తర్వాత ఆసీస్ ఆ సిరీస్ ఆడింది. ఈ నేపథ్యంలో సిరీస్ రీషెడ్యూల్పై బంగ్లా క్రికెట్ బోర్డు ఎలా స్పందిస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది.