మెల్బోర్న్: ప్రపంచ నంబర్వన్ నొవాక్ జొకోవిచ్కు తీవ్ర నిరాశ ఎదురైంది. రెండోసారి వీసా రద్దుపై చేసిన సవాల్ను ఫెడరల్ కోర్టు కొట్టివేసి.. ఆస్ట్రేలియా విడిచి వెళ్లాలని తీర్పునిచ్చింది. దీంతో సెర్బియా స్టార్ జొకో ఆస్ట్రేలియా ఓపెన్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయి స్వదేశానికి పయనమయ్యాడు. ప్రత్యేక వైద్య మినహాయింపుతో సీజన్ ఆరంభ గ్రాండ్స్లామ్లో పాల్గొనేందుకు వచ్చిన జొకోవిచ్ వీసాను ఆస్ట్రేలియా ఇమిగ్రేషన్ అధికారులు రెండోసారి రద్దు చేయడంపై అతడు ఆదివారం ఫెడరల్ కోర్టులో సవాల్ చేశాడు. జొకో పిటిషన్ను విచారించిన చీఫ్ జస్టిస్ జేమ్స్ అల్సోప్.. అతడి అప్పీల్ను కొట్టిపారేసి ఆస్ట్రేలియా విడిచివెళ్లాలని ఆదేశించడంతో పాటు కోర్టు వాదనలకైన ఖర్చు కూడా భరించాలని తీర్పునిచ్చారు.
ఆస్ట్రేలియా ఓపెన్ షురూ..
కరోనా వైరస్ విజృంభణ మధ్య సీజన్ తొలి గ్రాండ్స్లామ్కు సర్వం సిద్ధమైంది. నిబంధనలను అతిక్రమించిన జొకోవిచ్కు చుక్కెదురవగా.. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా గ్రాండ్స్లామ్ పురుషుల సింగిల్స్లో డానియల్ మెద్వెదెవ్ టాప్సీడ్గా బరిలోకి దిగనున్నాడు. స్టార్ ప్లేయర్ ఫెడరర్ గాయం కారణంగా టోర్నీకి దూరమవగా.. నాదల్, అలెగ్జాండర్ జ్వెరెవ్, బెర్టిని, ఇస్నర్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. మహిళల సింగిల్స్లో టాప్ సీడ్ ఆష్లే బార్టీ, నవోమి ఒసాక మధ్య ప్రధాన పోటీ ఉండనుంది.
మహిళల డబుల్స్లో హైదరాబాదీ స్టార్ సానియా మీర్జా.. నదియా కిచనోక్ (ఉక్రెయిన్)తో కలిసి బరిలోకి దిగనుంది. పురుషుల డబుల్స్లో ఎడ్వర్డ్ రోజర్ (ఫ్రాన్స్)తో జట్టు కట్టిన రోహన్ బోపన్న తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.