టోర్నీ నుంచి తప్పుకున్న అశ్విన్
మరో ముగ్గురు ఆసీస్ ఆటగాళ్లు కూడా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో ఐపీఎల్లో కలవరం మొదలైంది. వైరస్ ఆందోళనతో భారత సీనియర్ స్పిన్నర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్తో పాటు ముగ్గురు ఆస్ట్రేలియా ప్లేయర్లు టోర్నీ నుంచి తప్పుకున్నారు. దీంతో బయోబబుల్ బయట ఉన్న కుటుంబ సభ్యుల గురించి ఆటగాళ్లు పడుతున్న ఆందోళన వెలుగులోకి వచ్చింది. ‘ఈ ఏడాది ఐపీఎల్ నుంచి విరామం తీసుకుంటున్నా. నా కుటుంబం, దేశం కరోనాతో పోరాడుతున్నది. ఈ క్లిష్ట సమయంలో వారికి తోడుగా ఉండాలనుకుంటున్నా. పరిస్థితులు సద్దుమణిగితే మళ్లీ తిరిగివచ్చే అవకాశం ఉంది’అని అశ్విన్ సోమవారం ట్వీట్ చేశాడు. ఆస్ట్రేలియా ప్లేయర్లు ఆండ్రూ టై (రాజస్థాన్ రాయల్స్), కేన్ రిచర్డ్సన్, ఆడమ్ జంపా (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) కూడా ఈ సీజన్ నుంచి నిష్క్రమించారు. మరోవైపు ఐపీఎల్ కొనసాగుతుందని, ఒకవేళ ఎవరైనా తప్పుకోవాలనుకుంటే వారి ఇష్టమని, ఎలాంటి సమస్య లేదని బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి అన్నారు. కాగా కరోనా తీవ్రరూపం దాలుస్తుండడంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు కొందరు ఆందోళన చెందుతున్నారని, స్వదేశానికి తిరిగి వెళ్లాలని కోరుకుంటున్నారని కోల్కతా నైట్రైడర్స్ మెంటార్ డేవిడ్ హస్సీ చెప్పాడు. ఐపీఎల్ బయోబబుల్ చాలా సురక్షితమైనదని, అయితే బయటి పరిస్థితులే ఆందోళనకరంగా ఉన్నాయని ఆస్ట్రేలియా దిగ్గజం, ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్ అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో స్వదేశానికి పయనం కావడం కన్నా.. బయోబబుల్లో ఉండడమే క్షేమమని ఆసీస్ పేసర్ కౌల్టర్నైల్ అభిప్రాయపడ్డాడు.