న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ ఉస్మాన్ తారీఖ్(Usman Tariq) బౌలింగ్ యాక్షన్ వివాదాస్పదం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ బౌలర్ను ఎదుర్కొనేందుకు బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. బౌలింగ్ చేస్తున్న సమయంలో క్రీజ్ వద్దకు వచ్చిన తర్వాత అతను కాసేపు తన చేయిని ఆపి మళ్లీ బౌలింగ్ చేస్తున్నాడు. దీంతో ఆ బౌలర్ను ఆడేందుకు బ్యాటర్లు ఇబ్బందిపడుతున్నారు. ఇక బౌలింగ్ సమయంలో అతని కుడి చేయి 15 డిగ్రీల కన్నా ఎక్కువగా వంగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. తారీఖ్ బౌలింగ్ గురించి గతంలో ఆస్ట్రేలియా బ్యాటర్ కెమరూన్ గ్రీన్, దక్షిణాఫ్రికా బ్యాటర్ బ్రెవిస్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
అయితే టీ20 వరల్డ్కప్లో భాగంగా ఆదివారం పాకిస్థాన్, ఇండియా మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనున్నది. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ అశ్విన్ మన బ్యాటర్లకు ఓ సలహా ఇచ్చారు. ఉస్మాన్ తారీఖ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో .. ఒకవేళ అతను తన చేయిని మధ్యలో ఆపినప్పుడు మీరు పక్కకు జరగాలని ఇండియన్ బ్యాటర్లకు సలహా ఇచ్చాడు అశ్విన్. ఆగి బౌలింగ్ చేస్తున్న యాక్షన్తో 30 ఏళ్ల తారీఖ్కు ఇప్పటికే టీ20ల్లో మంచి రికార్డు ఉన్నది. టీ20ల్లో అతను 11 వికెట్లు తీసుకున్నాడు. ఆరు కన్నా తక్కువ సగటును పరుగులు ఇచ్చాడు. భారత్తో జరిగే మ్యాచ్లో అతని బౌలింగ్ కీలకంగా మారే అవకాశం ఉన్నది.
బంతి వేయడానికి ముందు తారీఖ్ ఆగిపోతే.. పక్కకు జరిగే హక్కు బ్యాటర్కు ఉంటుందని, అతను ఆగిపోతున్నాడేమో అన్న అనుమానాన్ని వ్యక్తం చేయవచ్చు అని, ఇలాంటి సందర్భాల్లో ఆన్ఫీల్డ్ అంపైర్కు ఆ సమస్య తలనొప్పిగా మారుతుందని మాజీ బౌలర్ అశ్విన్ పేర్కొన్నాడు. యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్విన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఒకవేళ నేను అక్కడ ఉండి ఉంటే, అలాగే చేసేవాడినని, మ్యాచ్ను గెలిచేందుకు రూల్స్ ప్రకారం అన్నీ చేయాల్సి ఉంటుందని, బౌలర్ ఎప్పుడు బంతిని రిలీజ్ చేస్తాడో తనకు తెలియదని చెప్పవచ్చు అని, అప్పుడు పక్కకు జరగవచ్చు అని, ఒకవేళ బ్యాటర్ ఓ వైపు జరిగితే, అప్పుడు అది అంపైర్ బాధ్యత అవుతుందని అశ్విన్ అన్నాడు.