టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ఇంకా నెల రోజులే ఉంది.. ఆ లోపు టీమ్ ఇండియా మరో 6 మ్యాచ్లే ఆడనుంది. ఈ పాటికే మెగాటోర్నీ జట్టుపై ఓ అంచనాకు రావాల్సి ఉండగా.. రోహిత్ సేన మాత్రం కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నది! ఆరు జట్లు మాత్రమే పాల్గొన్న ఆసియాకప్లో ఫైనల్కు చేరలేకపోయిన భారత్.. ఐసీసీ టోర్నీలో ఏం చేస్తుందో అనే సందేహాలు తలెత్తుతున్నాయి!
ధాటిగా ఆడాల్సిన పొట్టి ఫార్మాట్లో కేఎల్ రాహుల్ వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యమివ్వడం!! వరుసగా రెండు మ్యాచ్ల్లో 19వ ఓవర్ వేసిన భువనేశ్వర్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడం!! దినేశ్ కార్తీక్ను కాదని తుది జట్టులో చోటు దక్కించుకున్న పంత్ పేలవ షాట్లతో పెవిలియన్ చేరడం!! ఒక మ్యాచ్లో చక్కటి ప్రదర్శన కనబర్చిన రవి బిష్ణోయ్కు తదుపరి మ్యాచ్లో అవకాశం ఇలా జవాబు లేని ప్రశ్నలెన్నో రాహుల్ ద్రవిడ్ను వేధిస్తున్నాయి.
డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన టీమ్ఇండియా ఆసియాకప్లో ఫైనల్ చేరకుండానే ఇంటి బాటపట్టింది. గ్రూప్ దశలో రాణించిన రోహిత్ సేన.. సూపర్-4 తొలి రెండు మ్యాచ్ల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. పాకిస్థాన్తో పోరులో ఒత్తిడికి చిత్తైన భారత్.. శ్రీలంకతో మ్యాచ్లో అన్ని రంగాల్లో విఫలమైంది. ఇక చివరి పోరులో అఫ్గానిస్థాన్పై ఓదార్పు విజయం సాధించినా.. మేనేజ్మెంట్ ఆలోచనా ధోరణిపై సవాలక్ష ప్రశ్నలు లేస్తున్నాయి. ఎంత నామమాత్ర పోరైనా.. అఫ్గాన్తో మ్యాచ్లో చివరి ఓవర్ దినేశ్ కార్తీక్తో బౌలింగ్ చేయించడం అభిమానులను సైతం ఆశ్చర్యపరిచింది. అర్శ్దీప్ ఓవర్లు మిగిలే ఉన్నా.. ఇంతవరకు కెరీర్లో ఒక్కసారి కూడా బౌలింగ్ చేయని వ్యక్తితో ఆఖరి ఓవర్ వేయించడం టీమ్ఇండియాకే చెల్లింది. ఓ సెంచరీ, రెండు అర్ధశతకాలతో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్ అందుకోవడం తప్ప భారత్కు ఈ టోర్నీ పెద్దగా ఒరిగిందేమి లేదు. స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గాయపడి టీ20 ప్రపంచకప్నకు కూడా దూరం కాగా.. రిషబ్ పంత్లో ఆత్మవిశ్వాస లోపం తేటతెల్లమైంది.
భరోసా ఏది?
జట్టు కూర్పుపై 95 శాతం స్పష్టత వచ్చిందని కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొనగా.. నాలుగో స్థానంలో ఎవరు బరిలోకి దిగుతారో ఇంకా తేలలేదు. ఒక్కో మ్యాచ్లో ఒక్కో ఆటగాడిని పరీక్షించారు. దీపక్ హుడా, దినేశ్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్ణోయ్కు అవకాశాలు ఇచ్చినా.. వారికి జట్టులో చోటుపై భరోసా మాత్రం ఇవ్వలేకపోయారు. ఇక బౌలింగ్లో కీలకమైన రెండు మ్యాచ్ల్లో పేలవ ప్రదర్శన చేసిన భువనేశ్వర్ కుమార్.. అఫ్గాన్తో పోరులో ఐదు వికెట్లు పడగొట్టాడు. అవేశ్ ధారాళంగా పరుగులిచ్చుకోగా.. అర్శ్దీప్ ఉన్నంతలో ఫర్వాలేదనిపించాడు. గాయం నుంచి కోలుకొని జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులో చేరితే బౌలింగ్ బలం పెరిగినా.. ఆస్ట్రేలియా వంటి బౌన్సీ పిచ్లపై సీనియర్ పేసర్ మహమ్మద్ షమీని ఎంపిక చేయడమే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాక్తో తొలి పోరులో అటు బ్యాట్తో ఇటు బంతితో మెరిసిన హార్దిక్ పాండ్యా నుంచి జట్టు నిలకడైన ప్రదర్శన ఆశిస్తున్నది. మరి పొట్టి ప్రపంచకప్నకు ముందు భారత్ 6 టీ20 మ్యాచ్లు (ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో) ఆడాల్సి ఉండగా.. అందులోనైనా లోపాలు సరిచేసుకుంటుందా చూడాలి!