రెండు దశాబ్దాల తర్వాత తిరిగి కామన్వెల్త్ గేమ్స్లో చోటు దక్కించుకున్న క్రికెట్లో.. సత్తాచాటాలని భారత మహిళల జట్టు తహతహలాడుతున్నది. మన అమ్మాయిలు ఆడనున్న మ్యాచ్ల టికెట్లన్నీ
ఇప్పటికే అమ్ముడుపోగా.. హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మందన, షఫాలీ వర్మ మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతున్నారు. బర్మింగ్హామ్ బరిలోకి దిగుతున్నది స్వర్ణం సాధించేందుకే అని ప్రత్యర్థులకు
స్మృతి హెచ్చరికలు పంపిన నేపథ్యంలో మన అమ్మాయిల విజయావకాశాలపై ప్రత్యేక కథనం..
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం:రెండు దశాబ్దాల తర్వాత కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ దర్శనమివ్వనుంది. 1998 కౌలాలాంపూర్ వేదికగా జరిగిన క్రీడల్లో పురుషుల క్రికెట్ నిర్వహించగా.. ఆ తర్వాత నుంచి మెగా ఈవెంట్లో క్రికెట్ పోటీలు జరుగలేదు. 2028 లాస్ ఎంజిల్స్ ఒలింపిక్స్లో క్రికెట్ను ప్రవేశ పెట్టాలని ప్రయత్నిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ).. కామన్వెల్త్లో క్రికెట్ సూపర్ హిట్ కావాలని ఆశిస్తున్నది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన టీ20 ఫార్మాట్లో మ్యాచ్లు నిర్వహిస్తున్నది. బర్మింగ్హామ్ పరిసర ప్రాంతాల్లో భారతీయులు అధికంగా నివసిస్తుండటంతో.. టీమ్ఇండియా ఆడనున్న మ్యాచ్లకు ఇప్పటికే టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ నెల 31న భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగనుండగా.. ‘ ఈ మ్యాచ్ కామన్వెల్త్ గేమ్స్కే హైలైట్’ అని బర్మింగ్హామ్ గేమ్స్ సీఈవో ఇయాన్ రీడ్ పేర్కొన్నారు. ఈ క్రీడల్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటుండగా.. పాకిస్థాన్, ఆస్ట్రేలియా, బార్బడోస్తో కలిసి భారత్ గ్రూప్-‘ఎ’లో ఉంది. వన్డే, టీ20ల్లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్కు గట్టి పోటీ ఎదురుకానుంది. అన్ని మ్యాచ్లూ ఎడ్జ్బాస్టన్లోనే జరుగనుండగా.. ఈ నెల 29న ఆస్ట్రేలియాతో పోరుతో భారత్ తమ వేట ప్రారంభించనుంది.
స్వర్ణమే లక్ష్యంగా..
పొట్టి ఫార్మాట్లో తమదైన రోజు అనామక జట్టు కూడా సంచలనం నమోదు చేస్తుందని భారత వైస్ కెప్టెన్ స్మృతి పేర్కొంది. బర్మింగ్హామ్లో అడుగుపెట్టింది స్వర్ణం చేజిక్కించుకునేందుకే అని మందన స్పష్టం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న ఆస్ట్రేలియాతోనే భారత్కు ప్రధాన పోటీ ఎదురుకానుంది. ఇటీవల శ్రీలంకపై సిరీస్ విజయంతో హర్మన్ బృందం జోష్ మీదుండగా.. తొలి పోరులో ఆసీస్పై నెగ్గితే మన అమ్మాయిల ఆత్మవిశ్వాసం మరింత పెరుగనుంది. స్మృతి, షఫాలీ, హర్మన్, దీప్తి, మేఘన, పూనమ్ సమిష్టిగా సత్తాచాటితే టీమ్ఇండియాకు తిరుగుండదు. ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియాగేమ్స్ వంటి మెగా టోర్నీల్లో త్రివర్ణ పతాక రెపరెపలు తమలో స్ఫూర్తి నింపాయంటున్న మన ప్లేయర్లు.. అదే ఊపులో స్వర్ణం సాధించాలని ఆశిద్దాం.
పోడియంపై నిల్చున్నప్పుడు మన జాతీయ గీతం వినిపిస్తే ఆ భావన ఎలా ఉంటుందో చాలా సార్లు చూశాం. కచ్చితంగా పసిడి పతకం సాధించాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగుతాం. నీరజ్ చోప్రా ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన సందర్భంలో మా అందరి రోమాలు నిక్కబొడిచాయి. ఇప్పుడలాంటి అవకాశం మాకు వచ్చింది. -స్మృతి మందన