IPL 2023 : టీ20 లీగ్స్లో అతిపెద్ద క్రికెట్ పండుగ ఇండియన్ ప్రిమియర్ లీగ్ రేపటితో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్(Sanjay Manjrekar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఐపీఎల్ ట్రోఫీ కల ఈసారి నిజమవుతుందని అతను అన్నాడు. అంతేకాదు ఈ ఏడాది ఆర్సీబీతో పాటు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ టీమ్స్ ప్లే ఆఫ్స్కు చేరతాయని జోస్యం చెప్పాడు.
‘ఐపీఎల్ ట్రోఫీ గెలవాలనే విరాట్ కోహ్లీ కల ఈసారి నిజమవుతుంది. ఎందుకంటే..? ఈ సీజన్లో మిగతా జట్ల కంటే ఆర్సీబీ బౌలింగ్ యూనిటి పటిష్టంగా ఉంది. కోహ్లీతో పాటు కెప్టెన్ ఫ్లాఫ్ డూప్లెసిస్(Faf du Plessis) పరుగులు సాధిస్తే ఆ జట్టు చాంపియన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి’అని ఈ స్టార్ కామెంటేటర్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్లో అదృష్టం కలిసిరాని జట్టు ఏదైనా ఉందంటే అనది ఆర్సీబీనే. విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్, క్రిస్ గేల్, డేల్ స్టెయిన్ వంటి స్టార్లు ఉన్నా కూడా పదిహేను సీజన్లలో ఒక్కసారి కూడా చాంపియన్ కాలేకపోయింది. కీలక ఆటగాళ్లు రాణించడంతో మూడుసార్లు (2009, 2011, 2016) ఫైనల్ చేరింది. కానీ, ఆఖరి మెట్టుపై తడబడి కప్పు చేజార్చుకుంది. అయితే.. ఈసారి డాషింగ్ బ్యాటర్ ఫిన్ అలెన్, గ్లెన్ మ్యాక్స్వెల్, రజత్ పాటిదార్తో బ్యాటింగ్ విభాగం బలంగా ఉంది. వనిందు హసరంగ, సిరాజ్, హేజిల్వుడ్, హర్షల్ పటేల్ వంటి ఆటగాళ్లతో బౌలింగ్ యూనిట్ పటిష్టంగా కనిపిస్తోంది. దాంతో, ఈసారైనా తమ జట్టు కప్పు కొట్టాలని ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా కోరుకుంటారు. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టుతో ఏప్రిల్ 2న ఆర్సీబీ తొలి మ్యాచ్ ఆడనుంది.
అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రేపు (మార్చి 31న) ఐపీఎల్ పండుగ షురూ కానుంది. సాయంత్ర 5ః30 గంటల నుంచి ఓపెనింగ్ సెరమొనీ జరగనుంది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని, కార్యదర్శి జై షాతో పాటు పలువురు అధికారులు టోర్నీ ప్రారంభ వేడుకలకు హాజరుకానున్నారు. ఇండియా క్రష్గా పేరొందిన కన్నడభామ రష్మిక మందాన (Rashmika Mandanna), మిల్క్బ్యూటీ తమన్నా భాటియా (Tamanna Bhatia) ఆరంభ వేడుకల్లో డాన్స్తో అలరించనున్నారు. బాలీవుడ్ పాపులర్ సింగర్ అర్జిత్ సింగ్(Arjith Singh) తన గాత్రంతో అభిమానులను ఫిదా చేయనున్నాడు. అనంతరం పది జట్ల కెప్టెన్లు ట్రోఫీని ఆవిష్కరించనున్నారు. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్, నాలుగుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.