హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ నెగ్గిన తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. బర్మింగ్హామ్లో జరుగుతున్న పోటీల్లో నెగ్గిన వెంటనే.. నిఖత్తో ఫోన్లో మాట్లాడిన కేసీఆర్ దేశ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేశావని పేర్కొన్నారు. ఇటీవల ప్రపంచ చాంపియన్షిప్లో స్వర్ణం నెగ్గిన నిఖత్.. తాజా క్రీడల్లో స్వర్ణంతో సత్తాచాటడం మరింత సంతోషాన్నిచ్చిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. జరీన్ ప్రదర్శనతో తెలంగాణ కీర్తి మరోసారి విశ్వవ్యాప్తమైందని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తూనే ఉంటుందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.
ఈ ఏడాది రాష్ట్ర అవతరణ దినోత్సవం (జూన్ 2) రోజున.. ప్రపంచ చాంపియన్ నిఖత్కు కేసీఆర్ రూ. 2 కోట్ల నగదు బహుమతి అందించిన విషయం తెలిసిందే. నజరానాతో పాటు కుటుంబంతో సహా జరీన్ను ఇంటికి పిలిచి కలసి భోజనం చేశారు. ఆ సమయంలో నిఖత్.. సీఎంతో మాట్లాడుతూ.. మీరిచ్చిన స్ఫూర్తితో బర్మింగ్హామ్లో స్వర్ణం సాధిస్తానని చెప్పింది. ఇప్పుడా మాటలు నిజం చేస్తూ జరీన్ ఇంగ్లిష్ గడ్డపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించింది.