హైదరాబాద్, ఆట ప్రతినిధి: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న సీఎం కప్ టోర్నీ సోమవారం ప్రారంభం కానుంది. మొదట మండల స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించి అందులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిని జిల్లా స్థాయికి ఎంపిక చేయనున్నారు.
జిల్లా స్థాయిలో రాణించిన క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో పోటీపడనున్నారు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్) ఆధ్వర్యంలో జరుగునున్న ఈ మెగా క్రీడా సంబురానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 31 వరకు జరుగనున్న సీఎం కప్ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న క్రీడా శాఖ.. దీని కోసం రూ. 3.60 కోట్లు కేటాయించింది.