Cheteshwar Pujara: టీమిండియా బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా జాతీయ జట్టులో చోటు కోల్పోయినా దేశవాళీలో మాత్రం సత్తా చాటుతున్నాడు. ఇటీవలే మొదలైన రంజీ ట్రోఫీలో భాగంగా.. రాజ్కోట్ వేదికగా జార్ఖండ్తో జరుగుతున్న మ్యాచ్లో డబుల్ సెంచరీ (356 బంతుల్లో 243 నాటౌట్, 30 ఫోర్లు) చేయడంతో అతడు తిరిగి జాతీయ జట్టులో పునరాగమనం చేసే౦దుకు బలమైన పునాదులు వేసుకున్నాడు. కాగా జార్ఖండ్తో మ్యాచ్లో ద్విశతకం చేయడం ద్వారా పుజారా.. దేశవాళీ క్రికెట్లో దిగ్గజాల సరసన చేరాడు. దేశవాళీ క్రికెట్లో పుజారాకు జార్ఖండ్తో మ్యాచ్లో సెంచరీ 61వది. తద్వరా అతడు లెజెండరీ ప్లేయర్ విజయ్ హజారే పేరిట ఉన్న 60 శతకాల రికార్డును అధిగమించాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో భాగంగా భారత్ నుంచి అత్యధిక సెంచరీలు సాధించినవారిలో సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్లు ముందున్నారు. ఈ ఇద్దరూ 81 సెంచరీలు సాధించారు. మూడో స్థానంలో ప్రస్తుత భారత జట్టు హెడ్కోచ్ రాహుల్ ద్రావిడ్ (68) ఉన్నాడు. ఆ తర్వాత పుజారా (61), విజయ్ హజారే (60), వసీమ్ జాఫర్ (57), దిలీప్ వెంగ్సర్కార్ (55), వీవీఎస్ లక్ష్మణ్ (55) ఉన్నారు.
అత్యధిక ద్విశతకాలు..
రంజీ క్రికెట్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసినవారిలో పుజారా రెండో స్థానంలో ఉన్నాడు. పరాస్ డోగ్రా అత్యధికంగా 9 ద్విశతకాలు సాధించగా పుజారా.. 8 డబుల్ హండ్రెడ్స్ సాధించాడు. అజయ్ శర్మ, అభినవ్ ముకుంద్ లు ఏడు ద్విశతకాలు చేయగా సురేంద్ర భావె, అశోక్ మల్హోత్రలు ఆరు సార్లు డబుల్ సెంచరీలు చేశారు. ఓవరాల్గా పుజారాకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇది 17వ డబుల్ సెంచరీ కావడం విశేషం.
The moment when Cheteshwar Pujara completed his 200…!!!
– What a way to kick off 2024 Ranji Trophy season.pic.twitter.com/cS8z9l983C
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 7, 2024
భారత్లోనే గాక ఇంగ్లండ్ తరఫున కౌంటీలలో కూడా ఆడే పుజారా.. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన క్రికెటర్లలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్మన్ 37 సార్లు డబుల్ సెంచరీలు చేయగా ఇంగ్లండ్కు చెందిన వాలీ హ్యామండ్ (36), ఎలియాస్ హెన్రీ (22) ఉన్నారు. 17 ద్విశతకాలతో పుజారా.. మార్క్ రామ్ప్రకాశ్, హెర్బర్ట్ సుట్క్లిఫ్లతో కలిసి ఫోర్త్ ప్లేస్లో నిలిచాడు.
వీవీఎస్ రికార్డూ మాయం..
జార్ఖండ్తో మ్యాచ్లో 161 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పుజారా.. ఫస్ట్క్లాస్ క్రికెట్లో పరుగుల పరంగా వీవీఎస్ లక్ష్మణ్ను దాటాడు. హైదరాబాదీ మాజీ బ్యాటర్ 267 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో 19,730 పరుగులు చేయగా తాజాగా పుజారా.. లక్ష్మణ్ను అధిగమించాడు. భారత్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసినవారిలో సునీల్ గవాస్కర్ (25,834) అగ్రస్థానంలో ఉండగా రెండో స్థానంలో సచిన్ (25,396), మూడో స్థానంలో రాహుల్ ద్రావిడ్ (23,794), నాలుగో స్థానంలో పుజారా (19,812) ఉన్నాడు. లక్ష్మణ్ ఐదో స్థానానికి పడిపోయాడు.