ఐపీఎల్లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్కింగ్స్ (సీఎస్కే) అదిరిపోయే బోణీ కొట్టింది. సొంత ఇలాఖాలో తమకు తిరుగులేదని మరోమారు చాటిచెబుతూ ప్రియమైన ప్రత్యర్థి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)పై ఘన విజయం సాధించింది. ముస్తాఫిజుర్ నాలుగు వికెట్ల విజృంభణతో ఓ దశలో స్వల్ప స్కోరుకే పరిమితమవుతుందనుకున్న ఆర్సీబీ..రావత్, కార్తీక్ రాణించడంతో పోరాడే స్కోరు అందుకుంది. లక్ష్యఛేదనలో శివమ్ దూబే, రచిన్ రవీంద్ర, జడేజా బ్యాటింగ్తో చెన్నై తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
IPL | చెన్నై: ఐపీఎల్-17వ సీజన్ను చెన్నై తమదైన రీతిలో షురూ చేసింది. శుక్రవారం జరిగిన సౌత్ డెర్బీ పోరులో చెన్నై 6 వికెట్ల తేడాతో ఆర్సీబీపై అద్భుత విజయం సాధించింది. తొలుత ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 173/6 స్కోరు చేసింది. ముస్తాఫిజుర్(4/29) ధాటికి 78 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ..అనూజ్ రావత్(48), కార్తీక్(38 నాటౌట్) రాణించడంతో గౌరవప్రదమైన స్కోరు అందుకుంది. పటిదార్(0), మ్యాక్స్వెల్(0)సున్నాలు చుట్టారు. లక్ష్యఛేదనలో చెన్నై 4 వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది. శివమ్ దూబే (34 నాటౌట్) రచిన్ రవీంద్ర (37), జడేజా (25 నాటౌట్), సాధికారిక ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నారు. ఐపీఎల్ తొలి మ్యాచ్లోనే రచిన్ మంచి పరిణతి కనబరిచాడు. గ్రీన్ (2/27) రెండు వికెట్లు పడగొట్టాడు. ముస్తాఫిజుర్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. శనివారం లీగ్లో డబుల్ హెడర్ జరుగనుంది.
ముస్తాఫిజుర్ ఆన్ ఫైర్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరుకు మెరుగైన శుభారంభం లభించింది. చాహర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఐదో బంతిని ఫోర్గా మలిచి కెప్టెన్ డుప్లెసిస్ పరుగుల ఖాతా తెరిచాడు. వ్యక్తిగత కారణాలతో దాదాపు రెండు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్న కోహ్లీ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. మరో ఎండ్లో డుప్లెసిస్ దూకుడు ప్రదర్శిస్తూ చాహర్ వేసిన మూడో ఓవర్లో నాలుగు బౌండరీలతో 17 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. బౌలింగ్ మార్పుగా వచ్చిన బంగ్లా స్వింగ్స్టర్ ముస్తాఫిజుర్ రెహమన్..ఆర్సీబీ వికెట్ల పతనానికి తెరతీశాడు. భారీ షాట్కు ప్రయత్నించిన డుప్లెసిస్..డీప్ పాయింట్లో రచిన్ రవీంద్ర క్యాచ్తో తొలి వికెట్గా వెనుదిరిగాడు. దీంతో మొదటి వికెట్కు 41 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది.
రెండు బంతుల తేడాతో రజత్ పాటిదార్(0) ధోనీకి క్యాచ్ ఇస్తూ రెండో వికెట్గా పెవిలియన్ చేరాడు. మరుసటి ఓవర్లోనే హార్డ్ హిట్టర్ మ్యాక్స్వెల్(0)ను చాహర్ మూడో వికెట్గా పంపాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. ఇదే అదనుగా కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఒత్తిడి పెంచడంతో ఆర్సీబీకి పరుగుల రాక మందగించింది. ఈ క్రమంలో ఓవరాల్గా టీ20ల్లో 12000 మార్క్ అందుకున్న కోహ్లీ అంతగా ప్రభావం చూపించలేకపోయాడు. మరోమారు బౌలింగ్కు వచ్చిన ముస్తాఫిజుర్..ఈసారి బంతి తేడాతో కోహ్లీ(21), కామెరూన్ గ్రీన్(18) ఔట్ చేసి ఆర్సీబీని పీకల్లోతు కష్టాల్లో పడేశాడు. రహానే రిలే క్యాచ్తో కోహ్లీ ఔటైతే..గ్రీన్ క్లీన్బౌల్డ్గా వెనుదిరిగాడు. మొత్తంగా చెన్నైకి ఆడుతున్న తొలి మ్యాచ్లోనే ముస్తాఫిజుర్ తనదైన మార్క్ చూపెట్టాడు.
ఆదుకున్న రావత్, కార్తీక్: 78 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోరుకే పరిమితమవుతుందనుకున్న ఆర్సీబీని అనూజ్ రావత్, దినేశ్ కార్తీక్ ఆదుకున్నారు. ఈ ఇద్దరు కలిసి మొదట్లో సింగిల్స్తో స్ట్రైక్ రొటేట్ చేస్తూ కుదురుకున్నాక బౌలర్లపై విరుచుకుపడ్డారు. తుషార్ దేశ్పాండే 18వ ఓవర్లో కార్తీక్ సిక్స్, రావత్ రెండు సిక్స్లు, ఫోర్తో 25 పరుగులు దక్కించుకున్నారు. ఇలా వీరిద్దరు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డుకు కీలక పరుగులు జోడించారు. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి పరుగు తీయబోయిన రావత్ రనౌట్గా వెనుదిరిగాడు. దీంతో ఆరో వికెట్కు 95 పరుగుల కీలక భాగస్వామ్యానికి తెరపడింది. చెన్నైపై ఆరో వికెట్కు ఆర్సీబీకి ఇదే అత్యుత్తమం.
చెన్నై ఛేదన: బెంగళూరు నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యఛేదనను చెన్నై తమదైన శైలిలో మొదలుపెట్టింది. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతినే రుతురాజ్ ఫోర్ కొట్టి తన ఉద్దేశమేంటో చెప్పకనే చెప్పాడు. మరో ఎండ్లో రచిన్ రవీంద్ర కూడా బ్యాటు ఝులిపించడంతో చెన్నైకి పరుగుల రాక సులువైంది. యశ్ దయాల్ నాలుగో ఓవర్లో రెండు ఫోర్లతో దూకుడుమీద కనిపించిన గైక్వాడ్..గ్రీన్కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్గా వెనుదిరిగాడు. మరో ఎండ్లో రచిన్ తనదైన జోరు కొనసాగించడంతో పవర్ప్లే ముగిసే సరికి చెన్నై 62/1 స్కోరు చేసింది. ఆ మరుసటి ఓవర్లోనే సూపర్ సిక్స్తో ఇన్నింగ్స్ గేర్ మార్చిన రచిన్ (37) కర్ణ్శర్మ బౌలింగ్లో రెండో వికెట్గా ఔటయ్యాడు. అయినా వెనుకకు తగ్గని చెన్నై..దూబే, జడేజా బ్యాటింగ్తో గెలుపు లాంఛనాన్ని పూర్తి చేసింది.
రన్ మిషీన్ విరాట్ కోహ్లీ టీ20లలో మరో అరుదైన ఘనత అందుకున్నాడు. పొట్టి ఫార్మాట్లో 12 వేల పరుగులను పూర్తి చేసుకున్న తొలి భారత క్రికెటర్గా నిలిచాడు. చెన్నైతో మ్యాచ్లో ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ ఈ రికార్డు అందుకున్నాడు. క్రిస్ గేల్ 360 ఇన్నింగ్స్లలో ఈ ఘనత అందుకోగా కోహ్లీకి 368 ఇన్నింగ్స్లు అవసరమయ్యాయి.
బెంగళూరు: 20 ఓవర్లలో 173/6(రావత్ 48, కార్తీక్ 38 నాటౌట్, రెహమాన్ 4/29, చాహర్ 1/37), చెన్నై: 18.4 ఓవర్లలో 176/4(దూబే 34 నాటౌట్, రచిన్ 37, గ్రీన్ 2/27, కర్ణ్శర్మ 1/24).
ఐపీఎల్ 17 సీజన్ ఆరంభానికి ముందు బీసీసీఐ నిర్వహించిన ప్రారంభ వేడుకలు ప్రేక్షకులను అలరించాయి. బాలీవుడ్ అగ్రతారలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తమ నృత్యాలతో చెపాక్ స్టేడియాన్ని ఉర్రూతలూగించారు. అక్షయ్ ఎంట్రీ ఆకట్టుకుంది. ఈ ఇద్దరూ భారత జాతీయ పతాకాన్ని చేతబూని స్టేడియం అంతా బైక్పై కలియతిరిగారు.
అనంతరం ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్, మోహిత్ చౌహన్, ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్లు తమ పాటలతో అలరించారు. ఏఆర్ రెహ్మాన్.. హిందీతో పాటు తమిళ పాటలూ ఆలపించడంతో తమిళ తంబీలు మైమరిచిపోయారు. ‘బల్లెలక్క’, ‘నీ సింగం దా’ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. వీళ్ల ప్రదర్శనతో పాటు ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ సాయంతో ఢిల్లీ గేట్, చంద్రయాన్ విజయం, జీ20 నిర్వహణకు సంబంధించిన విజువల్స్ చూపరులను కట్టిపడేశాయి.