న్యూఢిల్లీ: భారత యువ ఓపెనర్ పృథ్వీ షా (39 బంతుల్లో 73; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) దూకుడుకు.. ఆదిత్య తారె (118 నాటౌట్; 18 ఫోర్లు) సంయమనం తోడవడంతో ముంబై జట్టు విజయ్ హజారే ట్రోఫీని చేజిక్కించుకుంది. ఆదివారం జరిగిన దేశవాళీ వన్డే టోర్నీ ఫైనల్లో ముంబై 6 వికెట్ల తేడాతో ఉత్తరప్రదేశ్ను చిత్తుచేసి నాలుగోసారి టైటిల్ ముద్దాడింది. మొదట ఉత్తరప్రదేశ్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 312 పరుగులు చేసింది. ఓపెనర్ మాధవ్ (158 నాటౌట్; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ శతకంతో చెలరేగగా.. సమర్థ్ సింగ్ (55), అక్ష్దీప్ (55) రాణించారు. లక్ష్యఛేదనలో పృథ్వీ షా, ఆదిత్య దంచి కొట్టడంతో ముంబై 41.3 ఓవర్లలో 4 వికెట్లకు 315 పరుగులు చేసి నెగ్గింది.
ఈ సీజన్లో 4 సెంచరీలు సహా 827 పరుగులు చేసిన పృథ్వీ షా.. విజయ్ హజారే టోర్నీ చరిత్రలో ఒకే సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.