జట్టులో చోటు నిలుపుకోవాలంటే భారీ ఇన్నింగ్స్ ఆడక తప్పని పరిస్థితుల్లో ఓపెనింగ్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ అజేయ శతకంతో విజృంభించాడు. ప్రత్యర్థి స్పిన్నర్ అజాజ్ పటేల్ బంతిని గింగిరాలు తిప్పుతూ సహచరులను బుట్టలో వేసుకుంటున్న తరుణంలో క్రీజులో పాతుకుపోవడమే కాక.. అతడిపైనే ఎదురుదాడికి దిగి పరుగులు రాబట్టాడు. జట్టు స్కోరులో సగం కంటే ఎక్కువ పరుగులు చేసి టీమ్ఇండియాకు మయాంక్ మెరుగైన ఆరంభం అందిస్తే.. ముంబైలోనే పుట్టి పెరిగి భారత్కు ప్రత్యర్థిగా బరిలోకి దిగిన అజాజ్ పటేల్ బంతితో ఆకట్టుకున్నాడు. మైదానం చిత్తడిగా ఉండటంతో తొలి రోజు రెండు సెషన్ల ఆట మాత్రమే సాధ్యం కాగా.. శనివారం టీమ్ఇండియా ఇంకెన్ని పరుగులు జోడిస్తుందో చూడాలి!
ముంబై: ఒత్తిడిని అధిగమిస్తూ.. స్పిన్ను ఛేదిస్తూ.. స్వింగ్కు అడ్డు నిలుస్తూ.. మయాంక్ అగర్వాల్ (246 బంతుల్లో 120 బ్యాటింగ్; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ శతకంతో చెలరేగడంతో న్యూజిలాండ్తో ప్రారంభమైన రెండో టెస్టులో టీమ్ఇండియా భారీ స్కోరు దిశగా సాగుతున్నది. గత రెండు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాల కారణంగా తడిసి ముైద్దెన వాంఖడే స్టేడియంలో శుక్రవారం తొలి రోజు ఆట నిలిచే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. జట్టు స్కోరులో సగం కంటే ఎక్కువ పరుగులు మయాంక్ ఒక్కడే రాబట్టగా.. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ (44) ఫర్వాలేదనిపించాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత ఆటకు విరామం ఇచ్చి తిరిగి జట్టుతో చేరిన రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ (0)తో పాటు చతేశ్వర్ పుజారా (0) సున్నాలు చుట్టారు. దీంతో ఒక దశలో 80/0తో మెరుగైన స్థితిలో ఉన్న భారత్.. మూడు ఓవర్ల వ్యవధిలో 80/3తో కష్టాల్లో పడింది. విరాట్ ఎల్బీడబ్ల్యూ విషయంలో గందరగోళం నెలకొనగా.. బంతి ముందు బ్యాట్కు తాకినట్లు స్పష్టమైనా.. థర్డ్ అంపైర్ మాత్రం ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే కట్టుబడటంతో కోహ్లీ తీవ్ర అసహనంతో బౌండ్రీ లైన్ను బ్యాట్తో కొడుతూ డ్రెస్సింగ్ రూమ్కు చేరాడు. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ (4/73) ఆకట్టుకున్నాడు. గత మ్యాచ్ సెంచరీ హీరో శ్రేయస్ అయ్యర్ (18) ఎక్కువ సేపు నిలువలేకపోగా.. మయాంక్తో కలిసి వృద్ధిమాన్ సాహా (25 బ్యాటింగ్; 3 ఫోర్లు, ఒక సిక్సర్) క్రీజులో ఉన్నాడు.
ఆ ముగ్గురి బదులు.. ఈ ముగ్గురు
కాన్పూర్ టెస్టుకు అందుబాటులో లేని రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టులోకి తిరిగి రాగా.. అతడి కోసం స్టాండిన్ కెప్టెన్ అజింక్యా రహానేను ‘గాయం’ నెపంతో మర్యాదపూర్వకంగా తప్పించారు. ఇక గత మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఇషాంత్ శర్మ ప్లేస్లో హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్కు తుది జట్టులో చోటు దక్కగా.. మోచేతి గాయంతో మ్యాచ్కు దూరమైన స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా స్థానంలో దాదాపు ఐదేండ్ల తర్వాత జయంత్ యాదవ్కు సుదీర్ఘ ఫార్మాట్లో మ్యాచ్ ఆడే చాన్స్ వచ్చింది. మరోవైపు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయంతో బాధపడుతుండటంతో అతడి స్థానంలో డారిల్ మిచెల్కు అవకాశం దక్కింది. కేన్ గైర్హాజరీలో కివీస్ జట్టుకు లాథమ్ సారథిగా వ్యవహరిస్తున్నాడు.
రెండు సెషన్లే..
గురువారం రాత్రి భారీ వర్షం కురువడంతో.. రెండున్నర గంటలు ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైంది. ఔట్ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో అంపైర్లు పలు సమీక్షలు నిర్వహించిన అనంతరం శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆట మొదలు పెట్టారు. ఫలితంగా తొలి రోజు రెండు సెషన్లు మాత్రమే సాధ్యమయ్యాయి. ముంబైలో పుట్టి పెరిగి ముంబై వేదికగానే భారత్కు ప్రత్యర్థిగా ఆడిన రెండో క్రికెటర్గా అజాజ్ పటేల్ నిలిచాడు. గతంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ డగ్లస్ జాైర్డెన్ కూడా ముంబైలోనే పుట్టి టీమ్ఇండియాకు ప్రత్యర్థిగా టెస్టు మ్యాచ్ ఆడాడు.
జట్టుకు ఎంపికైన సమయంలో రాహుల్ (ద్రవిడ్) భాయ్ నాతో.. “నీ చేతుల్లో ఏముందో దాని గురించే ఆలోచించు. అవకాశం వచ్చిన ప్రతిసారీ అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ప్రయత్నించు. క్రీజులో కుదురుకుంటే భారీ స్కోరుపై దృష్టి పెట్టు” అని అన్నాడు. నేను దాన్నే అమలు చేశా. అజాజ్ పటేల్ బౌలింగ్ ఎదుర్కోవడం ఇబ్బందిగానే అనిపించినా.. అతడిపై ఆధిపత్యం ప్రదర్శించాలనే భారీ షాట్లు ఆడా. ఆట సాగుతున్నా కొద్ది వికెట్ క్లిష్టతరంగా మారుతున్నది. శనివారం తొలి సెషన్ మొత్తం ఆడితే మంచి స్కోరు సాధ్యమే.
-మయాంక్ అగర్వాల్
స్కోరు బోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: మయాంక్ (నాటౌట్) 120, గిల్ (సి) టేలర్ (బి) అజాజ్ 44, పుజారా (బి) అజాజ్ 0, కోహ్లీ (బి) అజాజ్ 0, శ్రేయస్ (సి) బ్లండెల్ (బి) అజాజ్ 18, సాహా (నాటౌట్) 25, ఎక్స్ట్రాలు: 14, మొత్తం: 70 ఓవర్లలో 221/4. వికెట్ల పతనం: 1-80, 2-80, 3-80, 4-160, బౌలింగ్: సౌథీ 15-5-29-0, జెమీసన్ 9-2-30-0, అజాజ్ 29-10-73-4, సోమర్విల్లె 8-0-46-0, రచిన్ 4-0-20-0, మిచెల్ 5-3-9-0.