కౌలాలాంపూర్: సీజన్ ఆరంభ టోర్నీ మలేషియా ఓపెన్లో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి, మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప-తనీషా జోడీలు క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టగా.. పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ పరాజయం పాలయ్యాడు.
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-1000 టోర్నీ పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్లో గురువారం సాత్విక్-చిరాగ్ జోడీ 21-11, 21-18తో లూకాస్ కార్వీ-రోనాన్ లాబర్ (ఫ్రాన్స్) జంటపై గెలుపొందింది. తొలి రౌండ్లో ఆకట్టుకున్న శ్రీకాంత్ ప్రిక్వార్టర్స్లో 13-21, 17-21 లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో ఓటమి పాలయ్యాడు. అశ్విని-తనీషా ద్వయం 21-19, 13-21, 21-15తో జపాన్ జోడీపై నెగ్గింది.