T20 World Cup | టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు పెద్దగా సిద్ధమవ్వాల్సిన అవసరం లేదని టీమిండియా కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కొన్నిరోజుల క్రితం వరకూ ఆటగాళ్లంతా ఐపీఎల్ ఆడారని, కాబట్టి వారు ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉందని తాను అనుకోవడం లేదని రవిశాస్త్రి చెప్పాడు.
ఇంగ్లండ్తో జరిగిన వామప్ మ్యాచ్లో టీమిండియా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఓపెనర్లు ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. బౌలింగ్లో కూడా మహమ్మద్ షమీ, బుమ్రా ఆకట్టుకున్నారు. ఈ మ్యాచ్ సందర్భంగా రవిశాస్త్రి మీడియాతో మాట్లాడారు.
టాస్, టీమ్ ఎంపిక వంటి నిర్ణయాల కోసం ప్రత్యేకంటా ఎటువంటి స్ట్రాటజీని తాము అనుసరించడం లేదని, పిచ్ పరిస్థితులను బట్టి ఆ నిర్ణయాలు తీసుకుంటామని చెప్పాడు.
‘‘కుర్రాళ్లంతా గడిచిన 2 నెలలుగా ఐపీఎల్ ఆడుతున్నారు. వారు పెద్దగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉందని నేననుకోవడం లేదు. వాళ్లంతా కలిసి, పరిస్థితులకు అలవాటు పడటమే ముఖ్యం’’ అని రవిశాస్త్రి వివరించాడు. ఈ టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా కోచ్గా రవిశాస్త్రి కాంట్రాక్ట్ పూర్తవుతుంది.
అతని స్థానంలో రాహుల్ ద్రవిడ్ను ఎంపిక చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకూ రవిశాస్త్రి హయాంలో టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ ఒక్కటే అతనికి చివరి అవకాశంగా కనిపిస్తోంది. టీమిండియా కూడా ఈ టోర్నీ ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగుతోంది. ఈ క్రమంలో జట్టుపై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే.