Strandja Boxing Tourney | సోఫియా(బల్గేరియా): ప్రతిష్ఠాత్మక స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్ల హవా కొనసాగుతున్నది. శుక్రవారం జరిగిన వేర్వేరు విభాగపు బౌట్లలో అమిత్ పంగల్, సచిన్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. పురుషుల 51కిలోల క్వార్టర్స్లో అమిత్ 5-0తో అల్దారిచ్ బతుల్గా(మంగోలియా)పై అద్భుత విజయం సాధించాడు. టోర్నీలో తనదైన జోరు కనబరుస్తున్న అమిత్..టైటిల్ ఫైట్కు మరో అడుగుదూరంలో నిలిచాడు. బౌట్ విషయానికొస్తే..ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచిన పంగల్.. ప్రత్యర్థిని పదునైన పంచ్లతో విరుచుకుపడ్డాడు.
తన అనుభవాన్నంతా కూడదీసుకున్న ఈ హర్యానా బాక్సర్…మూడు రౌండ్లలో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెడుతూ కీలక పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు 57కిలోల క్వార్టర్స్ పోరులో సచిన్ 4-1తో కపాన్ గియోర్గీ(జార్జియా)పై విజయంతో సెమీస్లోకి అడుగుపెట్టాడు. బౌట్లో కుదురుకునేందుకు కొంత సమయం తీసుకున్న సచిన్..ఆ తర్వాత ప్రత్యర్థి బాక్సర్కు ఎక్కడా అవకాశమివ్వలేదు. ప్రతిదాడులతో బౌట్ను తన వశం చేసుకున్నాడు. శనివారం జరిగే సెమీస్లో అబ్దురెమోవో ఏదర్(ఉక్రెయిన్)తో సచిన్ తలపడనున్నాడు. నవీన్కుమార్(92కి) సెమీస్లోకి అడుగుపెట్టగా, జుగ్ను(86కి), సాగర్(92కి) టోర్నీ నుంచి నిష్క్రమించారు.