ఖలీల్వాడి: ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో పసిడి పతకంతో కొత్త చరిత్ర లిఖించి తొలిసారి ఇందూరులో అడుగుపెట్టిన యువ బాక్సర్ నిఖత్ జరీన్కు ఘన స్వాగతం లభించింది. గురువారం పూలాంగ్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ మీదుగా ఖలీల్వాడలోని న్యూ అంబేద్కర్ భవన్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్గుప్తా, షకీల్, జడ్పీ చైర్మన్ విఠల్రావు, మేయర్ నీతూకిరణ్, కలెక్టర్ నారాయణరెడ్డి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్రెడ్డి.. నిఖత్కు లక్ష రూపాయలు, ఆమెకు బాక్సింగ్లో ఓనమాలు నేర్పించిన కోచ్ శంషుద్దీన్కు రూ.50వేల నగదు ప్రోత్సాహం అందించారు. అర్బన్ ఎమ్మెల్యే గణేశ్గుప్తా లక్ష రూపాయల పారితోషం అందించగా, తన నియోజకవర్గంలో నిఖత్కు సన్మానం చేసి ఇంటి స్థలం ఇస్తానని షకీల్ ప్రకటించారు. తనకు ఈ స్థాయిలో స్వాగతం పలుకడం పట్ల నిఖత్ సంతోషం వ్యక్తం చేసింది.