తాష్కెంట్: భారత యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాడు. వరుస విజయాలతో ఫుల్ జోష్లో ఉన్న ఈ తెలంగాణ బాక్సర్ ఆదివారం ప్రి క్వార్టర్స్లో ఏకపక్ష విజయం నమోదు చేసుకున్నాడు.
57 కేజీల విభాగంలో బరిలోకి దిగిన హుసాముద్దీన్ 5-0తో ఎడ్వర్డ్ సావిన్ (రష్యా)పై విజయం సాధించాడు. బౌట్ ఆరంభం నుంచే తన పంచ్లతో ప్రత్యర్థిని బెదరగొట్టిన హుసామ్.. చివరి వరకు అదే జోరు కొనసాగించి జయకేతనం ఎగరవేశాడు. మరో బౌట్లో దీపక్ భొరియా (51 కేజీలు) 5-2తో టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాకేన్ (కజకస్థాన్)పై నెగ్గాడు.