Sunil Shetty | భారత్ జట్టులో స్టార్ ఆటగాళ్లకు కొదవ లేకున్నా.. తనకు రన్మెషీన్ విరాట్ కోహ్లీ అంటేనే ఎక్కువ ఇష్టమని బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి పేర్కొన్నాడు. ప్రస్తుత జట్టులో ప్లేయర్లందరు నైపుణ్యం ఉన్న వాళ్లే అయినా.. లక్ష్యఛేదనలో కోహ్లీ కసికి ఎవరూ సాటిరారని సునీల్ శెట్టి వెల్లడించాడు. ఇక ప్రస్తుతం టీమ్ఇండియా వికెట్ కీపర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న లోకేశ్ రాహుల్.. స్వయానా తనకు అల్లుడే అయినా.. ఫేవరెట్ క్రికెటర్ మాత్రం కోహ్లీ అని స్పష్టం చేశాడు.
స్వతహాగా క్రికెట్ అభిమాని అయిన సునీల్ శెట్టి వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో మాట్లాడుతూ.. ‘రాహుల్ నా కుటుంబ సభ్యుడు. కొడుకు లాంటి వాడు. కానీ ఫేవరెట్ క్రికెటర్ విషయానికి వస్తే మాత్రం నిర్మొహమాటంగా విరాట్ కోహ్లీ అని చెప్తా. ఎందుకంటే.. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు, లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చినప్పుడు కోహ్లీ అసలు సిసలు ఆటతీరు కనబరుస్తాడు. అందుకే అతడిని చేజ్ మాస్టర్ అంటారు. ఛేదనలో అతడి బ్యాటింగ్ వేరే లెవల్లో ఉంటుంది’ అని వెల్లడించాడు. సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి, కేఎల్ రాహుల్ ఈ ఏడాది జనవరిలో పెండ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్నకు ముందు గాయంతో ఇబ్బంది పడిన కేఎల్ రాహుల్.. అసలు మెగాటోర్నీకి ఎంపికవుతాడా అనే సందేహాలు వెల్లువెత్తగా.. ఆసియాకప్ ఘనంగా రీఎంట్రీ ఇచ్చిన రాహుల్ ఆ తర్వాత వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక అక్కడి నుంచి నిలకడ కొనసాగిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి పోరులో టాపార్డర్ విఫలమైన చోట విరాట్ కోహ్లీతో కలిసి కేఎల్ రాహుల్ జట్టును గెలిపించాడు. ఆ ఒక్క మ్యాచ్ అనే కాకుండా.. అవసరమైన ప్రతి మ్యాచ్లో విలువైన పరుగులు జోడిస్తూ.. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక వికెట్ కీపర్గానూ చక్కటి ఆటతీరుతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు.