అరంగేట్రంలోనే ట్రిపుల్ సెంచరీ
రంజీ ట్రోఫీ
కోల్కతా: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ అరంగేట్రంలోనే బీహార్ ఆటగాడు సకీబుల్ గనీ (405 బంతుల్లో 341; 56 ఫోర్లు, 2 సిక్సర్లు) అరుదైన ఘనత సాధించాడు. సుదీర్ఘ చరిత్ర కలిగిన టోర్నీలో బరిలోకి దిగిన తొలి మ్యాచ్లోనే ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ మ్యాచ్లో మిజోరాంపై విశ్వరూపం కనబర్చిన గనీ.. బౌండ్రీల ద్వారానే డబుల్ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. గనీతో పాటు బబుల్ కుమార్ (229 నాటౌట్) అజేయ ద్విశతకం బాదడంతో బీహార్ 686/5 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన మిజోరాం రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 40 రన్స్ చేసింది.
హైదరాబాద్ 347
వ్యక్తిగత ప్రదర్శనలు గొప్పగా లేకపోయినా.. తలా కొన్ని పరుగులు చేయడంతో చండీగఢ్తో జరుగుతున్న మ్యాచ్లో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్లో 347 రన్స్ చేసింది. హనుమ విహారి (59) టాప్ స్కోరర్. చండీగఢ్ బౌలర్లలో జగ్జీత్ సింగ్ 4, రాజ్ బవా, గౌరవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన చండీగఢ్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 200/6 వద్ద నిలిచింది. మనన్ వోహ్రా (110) సెంచరీ సాధించగా.. అండర్-19 ప్రపంచకప్ హీరో రాజ్ బవా (39 బ్యాటింగ్) ఫర్వాలేదనిపించాడు. హైదరాబాద్ బౌలర్లలో రక్షణ్ రెడ్డి నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.