BCCI: అంతర్జాతీయ మ్యాచ్లు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తప్ప మరే ఇతర మ్యాచ్లు ఆడబోమని గిరిగీసుకుని కూర్చున్న పలువురు భారత క్రికెటర్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ షాకిచ్చింది. రెస్ట్ తీసుకుంటామని చెప్పి జట్టు నుంచి తప్పుకున్న క్రికెటర్లంతా తప్పకుండా దేశవాళీ క్రికెట్ ఆడాలని, నేరుగా జాతీయ జట్టులోకి ఎంట్రీ కుదరదని స్పష్టం చేసింది. ప్రస్తుతం జాతీయ జట్టుతో ఉన్న ఆటగాళ్లు, నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లో రిహాబిటేషన్లో ఉన్న క్రికెటర్లు మినహా మిగిలినవారంతా నెక్స్ట్ రౌండ్ రంజీ మ్యాచ్లు ఆడాల్సిందేనని హుకుం జారీ చేసింది. ప్రత్యక్షంగా పేరు చెప్పకపోయినా టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్కు ఇది షాకే. కిషన్తో పాటు బరోడాలో ట్రైనింగ్ అవుతున్న హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, దీపక్ చాహర్, శ్రేయస్ అయ్యర్ లు కూడా దేశవాళీలో తమ రాష్ట్ర జట్లకు ప్రాతినిథ్యం వహించాల్సిందే.
గతేడాది డిసెంబర్లో దక్షిణాఫ్రికా టూర్కు వెళ్లిన భారత జట్టులో ఉన్న ఇషాన్ కిషన్.. వన్డే సిరీస్ ఆరంభానికి ముందే వ్యక్తిగత కారణాలు చెప్పి ఇంటికి తిరిగొచ్చాడు. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఇషాన్.. జాతీయ జట్టుకు దూరమైనా తిరిగి టీమ్లోకి రావాలంటే కచ్చితంగా దేశవాళీలో ఆడాల్సిందేనని టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రావిడ్ ఇదివరకే పలుమార్లు అతడికి సూచించాడు. కానీ ఇషాన్ మాత్రం ద్రావిడ్ మాటలను పెడచెవిన పెట్టాడు. ద్రావిడ్ ఎన్నిసార్లు చెప్పినా ఇషాన్ మాత్రం అసలు తనకు రంజీలతో సంబంధమే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు బీసీసీఐ ఆదేశాలతో ఇషాన్ తప్పనిసరిగా రంజీలు ఆడాల్సిందే.
The BCCI has taken decisive action the players who aren’t part of India’s squad or at NCA to join their respective State teams for upcoming matches in Ranji Trophy. (Cricbuzz) pic.twitter.com/4GcS73x8NV
— CricketMAN2 (@ImTanujSingh) February 12, 2024
ఇక హార్ధిక్ విషయానికొస్తే.. గతేడాది వన్డే వరల్డ్ కప్లో భాగంగా బంగ్లాదేశ్తో పూణె వేదికగా జరిగిన మ్యాచ్లో గాయపడ్డాడు. ఆ తర్వాత జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో చేరాలని పలుమార్లు సూచించినా అతడు మాత్రం బరోడాలో ట్రైన్ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్కు సారథిగా వ్యవహరిస్తున్న హార్ధిక్.. మరో నెల వరకూ పూర్థిస్థాయిలో సిద్ధమయ్యేందుకు కసరత్తులు చేస్తున్నాడు. అయితే బీసీసీఐ ఆదేశాలతో అతడు కూడా దేశవాళీలో పాల్గొనాల్సిందే.