న్యూఢిల్లీ: టీం ఇండియా సారధి విరాట్ కోహ్లీకి, బీసీసీఐకి మధ్య సమాచార లోపం ( Communication Gap ) ఉందని టీం ఇండియా మాజీ క్రికెటర్.. సెలెక్టర్ సందీప్ పాటిల్ శుక్రవారం పేర్కొన్నాడు. యూఏఈలో జరిగే టీ-20 వరల్డ్ కప్ తర్వాత టీ-20 కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు విరాట్ కోహ్లీ గురువారం వెల్లడించిన సంగతి తెలిసిందే. టీ-20 కెప్టెన్గా విరాట్ కోహ్లీ తప్పుకుంటాడని వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలేనని బీసీసీఐ ఇంతకుముందు కొట్టి పారేసింది. ఆ తర్వాత రెండు రోజులకే టీ-20 సారధ్యం నుంచి వైదొలుగుతున్నట్లు కోహ్లీ ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యంలో సందీప్ పాటిల్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
విరాట్ కోహ్లీ ఒకటి చెబితే, బీసీసీఐ మరొకటి చెబుతున్నది. కెప్టెన్సీ.. బ్యాటింగ్పై దృష్టి కేంద్రీకరించడం అంత తేలిక్కాదు. టీ-20 టీం సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం పూర్తిగా కోహ్లీ తీసుకున్న నిర్ణయం.. దీన్ని బీసీసీఐ అంగీకరించాలి. కోహ్లీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా.. ఆయన నిర్ణయం బ్యాటింగ్పై దృష్టిని కేంద్రీకరించడానికి సాయ పడుతుంది అని అన్నాడు.