ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ నుంచి ప్రారంభం కావాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ తో తమ ప్రయాణం ఆరంభించనుంది. అయితే అంతకుముందే ఇరు జట్ల అభిమానులకు దాయాది దేశాల సమరం వీక్షించే అవకాశం దక్కనుంది. అది కూడా వచ్చే నెలలోనే. ఆగస్టులో జరుగబోయే ఆసియా కప్ లో చిరకాల ప్రత్యర్థులు తలపడబోతున్నాయి.
షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించాల్సి ఉన్న ఆసియాకప్ నిర్వహణపై గతంలో నీలి నీడలు కమ్ముకున్నాయి. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అసలు ఈ టోర్నీ జరుగుతుందా..? లంకలో ఆసియా కప్ ను నిర్వహించే అవకాశముందా..? అని ఆసియా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) గతంలో అనుమానాలు వ్యక్తం చేసింది. శ్రీలంకలో జరగకుంటే దుబాయ్ వేదికగానైనా ఈ టోర్నీని జరిపేందుకు ఏసీఏ సన్నాహకాలు చేసింది.
కానీ తాజా సమాచారం ప్రకారం ఆసియా కప్-2022 ను లంకలోనే నిర్వహించనున్నారని తెలుస్తున్నది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు శ్రీలంకలో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత్-పాకిస్తాన్ మధ్య ఆగస్టు 28న గ్రూప్ మ్యాచ్ జరగనున్నట్టు సమాచారం. ఈసారి ఆసియా కప్ ను వన్డే ఫార్మాట్ లో కాకుండా టీ20లుగా ఆడిస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఇంకా వెలువడాల్సి ఉంది.
ఇక ఈ టోర్నీలో ఇండియా-పాకిస్తాన్ ఫైనల్ కు వెళ్తే అభిమానులకు చాలారోజుల తర్వాత అసలు సిసలు క్రికెట్ మజా దొరికినట్టే. ఈ టోర్నీ తర్వాత భారత్-పాకిస్తాన్ అక్టోబర్ 23న మెల్బోర్న్ వేదికగా మ్యాచ్ జరగాల్సి ఉంది. గతేడాది దుబాయ్ లో చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగిన సమరంలో పాకిస్తాన్ భారత్ ను పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. దానికి బదులు తీర్చుకోవడానికి టీమిండియాకు ఇది సదావకాశం.
Asia cup to be held in Sri Lanka from 27th August to 11 September.
India Vs Pakistan scheduled on the 28th August 2022. #asiacup2022
— Nibraz Ramzan (@nibraz88cricket) July 6, 2022