Saurav Gangooli | త్వరలో బెంగళూరులో ఏర్పాటు కానున్న జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) స్టేడియం కోసం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శంకుస్థాపన చేశాడు. వచ్చే ఏడాది ఈ స్టేడియం క్రికెటర్లకు అందుబాటులోకి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీసీసీఐ కార్యదర్శి జయ్షా కూడా పాల్గొన్నారు. దేశవాళీ క్రికెట్ ఆడేందుకు వీలుగా మూడు గ్రౌండ్స్ను సిద్ధం చేస్తున్నారు. ఈ భూమిని 99 ఏండ్లపాటు లీజ్కు తీసుకుని బీసీసీఐ అకాడమీ ఏర్పాటు చేస్తున్నది.
ఇదిలా ఉండగా జాతీయ క్రికెట్ అకాడమీ నిర్మాణ పనులను ఈ రోజు శంకుస్థాపన చేశాం అని గంగూలీ ట్వీట్ చేశాడు. ఈ కార్యక్రమం ఫొటోలను కూడా షేర్ చేశాడు. బీసీసీఐ సారధ్యంలో కొత్త క్రికెట్ అకాడమీ నిర్మాణానికి పునాది పడిందని బీసీసీఐ కార్యదర్శి జయ్షా చెప్పాడు. యువ క్రికెటర్లకు ప్రోత్సాహంతోపాటు దేశంలో క్రికెట్కు ఆదరణ పెంచడానికే తాము సమిష్ఠిగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి అరుణ్ ధూమల్, జాయింట్ సెక్రెటరీ జయేశ్ జార్జ్, ఎన్సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)ని బీసీసీఐ నిర్వహిస్తున్నది. 2000లో దీనిని ఏర్పాటు చేశారు. ఇందుకు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ)కు బీసీసీఐ అద్దె చెల్లిస్తున్నది. ఇందులో ఔట్డోర్ స్టేడియం, ఇండోర్ స్టేడియం, మోడ్రన్ వ్యాయామశాల తదితర వసతులు ఉన్నాయి.