న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో పాల్గొననున్న భారత బృందానికి మద్దతుగా నిలుస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రూ.10 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ)తో పాటు కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా అధ్యక్షతన ఆదివారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బీసీసీఐ ఈ తీర్మానం చేసింది. చైనాకు చెందిన స్పాన్సర్ లీ నింగ్ను తప్పించడంతో ఐవోఏకు నష్టం రాగా.. బీసీసీఐ విరాళం ఊరట కలిగించనుంది. కాగా బీసీసీఐకి ఐవోఏ అధ్యక్షుడు నరీందర్ బాత్రా కృతజ్ఞతలు చెప్పారు.
2024 -2032 మధ్య ప్రతీ రెండేండ్లకు ఓ ఐసీసీ మెగా ఈవెంట్కు ఆతిథ్యమివ్వాలని బీసీసీఐ నిర్ణయించుకుంది. అందుకోసం బిడ్లు వేసేందుకు అపెక్స్ కౌన్సిల్లో ప్రణాళికలు రచించింది. 2025 చాంపియన్స్ ట్రోఫీ, 2028 టీ20 ప్రపంచకప్, 2031 వన్డే వరల్డ్కప్ ఆతిథ్యహక్కుల కోసం బిడ్లు వేసేందుకు బీసీసీఐ సిద్ధమైందని బోర్డుకు చెందిన సీనియర్ అధికారి చెప్పారు.