ప్రపంచంలో క్రికెట్ ఆడే దేశాలన్నింటి (పాకిస్తాన్ తప్ప)ని జల్లెడ పట్టి దూకుడుగా ఆడే క్రికెటర్లను ఏరికోరి తెప్పించి వారితో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆడిస్తున్నాయి ఇక్కడి ఫ్రాంచైజీలు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి పెద్ద దేశాలతో పాటు సింగపూర్, నమీబియా వంటి దేశాల నుంచి కూడా వచ్చి ఐపీఎల్ ఆడుతున్నారు. పలువురు పేరుమోసిన క్రికెటర్లు ఐపీఎల్తో పాటు మిగతా లీగ్స్లోనూ మెరస్తున్నారు. కానీ భారత క్రికెట్ అభిమానులకు ఆ అవకాశం లేదు. టీమిండియా క్రికెటర్లు ఆడితే ఐపీఎల్ లేదంటే జాతీయ జట్టుకే.. అంతకుమించి వాళ్లు ఫారెన్ లీగ్లో కనిపించడానికి అవకాశం లేదు. కానీ ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడుతున్నాయి.
త్వరలో భారత క్రికెటర్లూ ఫారెన్ లీగ్స్లో ఆడేందుకు బీసీసీఐ అవకాశం కల్పించనుంది. ఈ మేరకు ఇటీవలే ముంబైలో ముగిసిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్లో దీనిపై చర్చ కూడా జరిగినట్టు సమాచారం. అయితే దీనిపై సెప్టెంబర్లో జరగాల్సి ఉన్న వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) లో పూర్తి స్పష్టత రానున్నదని తెలుస్తున్నది.
ఐపీఎల్కు చెందిన ఫ్రాంచైజీలు ఇటీవల దక్షిణాఫ్రికాలో వచ్చే ఏడాది నుంచి అక్కడ ప్రారంభం కాబోయే సౌతాఫ్రికా టీ20 క్రికెట్ లీగ్లో భాగం కాబోతున్నాయి. ఆరింటికి ఆరు జట్లను మన ఫ్రాంచైజీ (ముంబై, చెన్నై, హైదరాబాద్, రాజస్తాన్, లక్నో, ఢిల్లీ ఫ్రాంచైజీలు) ఓనర్లే దక్కించుకున్నారు. దీంతో వారంతా భారత ఆటగాళ్లను విదేశీ లీగ్స్లో అనుమతించాలని బీసీసీఐపై ఒత్తిడి తీసుకువస్తున్నారని సమాచారం. సౌతాఫ్రికాతో పాటు యూఏఈ లీగ్, అబుదాబి టీ10 లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) లలో కూడా మన ఓనర్లు పెట్టుబడులు పెట్టారు.
ప్రస్తుతం.. భారత జాతీయ జట్టుతో పాటు దేశవాళీ క్రికెట్ ఆడే ఆటగాళ్లెవరూ ఐపీఎల్ మినహా ఫారెన్ లీగ్స్లో భాగం కావడానికి వీళ్లేదు. కానీ ఇక భారత క్రికెట్లో తాము భాగం కాబోమని భావించేవాళ్లను మాత్రం బీసీసీఐ ఆపడం లేదు. ఒకసారి ఫారెన్ లీగ్ ఆడితే ఇండియాలో మళ్లీ దేశవాళీ గానీ జాతీయ జట్టులో గానీ ఆడే ఆస్కారం లేదు. అయితే బీసీసీఐ మహిళా క్రికెటర్లకు మాత్రం ఫారెన్ లీగ్స్లో ఆడే అవకాశాన్నిచ్చింది. వాళ్లపై ఎలాంటి నిబంధనలు లేవు.